స్వాహానే ఎజెండా!

9 May, 2019 03:38 IST|Sakshi

టీడీపీ నేతలకు రూ.1,920 కోట్ల ఉపాధి హామీ బిల్లుల కోసమే కేబినెట్‌ భేటీ

కోడ్‌లోనే రూ.540 కోట్లకుపైగా బిల్లులు రెడీ

నిధులు లేకున్నా కొనసాగుతున్న పనులు

ఎన్నికల ఫలితాలలోపే అంతా చక్కబెట్టుకునేందుకు సిద్ధం

‘పంచాయతీ పోరు’లో క్యాడర్‌ను సంతృప్తి పరిచే ‘ముఖ్య’వ్యూహం

ప్రభుత్వం మారినా ఇబ్బంది రాకుండా ప్రణాళిక

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ ఈసీ, సీఎస్‌లపై ఒత్తిడి తెచ్చి మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ద్వారా రూ.1,920 కోట్ల ఉపాధిహామీ పెండింగ్‌ బిల్లులను పార్టీ నేతలకు చెల్లించాలనేది సీఎం చంద్రబాబు ఎత్తుగడగా అధికారవర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన నిర్వహించాలని భావిస్తున్న మంత్రివర్గ సమావేశం అజెండాలో ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లుల అంశం కూడా ఉండటం గమనార్హం.
– సాక్షి, అమరావతి

ఇవన్నీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా అధికార పార్టీ నేతలు నామినేషన్‌ పద్ధతిలో సిద్ధం చేసుకున్న ఉపాధి హామీ పథకం బిల్లులు. టీడీపీ గ్రామ స్థాయి నేతలు గత అర్నెళ్లుగా రూ.1,920 కోట్ల విలువైన పనులు చేసినట్లు ఎన్నికల ముందు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఉపాధి హామీ పనుల పేరుతో ఈనెల 14వ తేదీన నిర్వహించాలని భావిస్తున్న క్యాబినెట్‌ భేటీలో చర్చించి ఈ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుండటంతో ‘ఉపాధి’ డబ్బులను టీడీపీ నేతలకు వెదజల్లేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పెండింగ్‌లో భారీగా బిల్లులు ఉన్నా పనులు మాత్రం జరుగుతున్నాయి.

కొత్త సర్పంచులు వస్తే బెడిసికొడుతుందనే..
ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్ల వ్యవస్థకు తావుండదు. ఉపాధి హామీలో చేపట్టే ఏ పనికైనా ఆ గ్రామ పంచాయితీకే నిధులు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీనే ఏ అవసరానికి ఎంత ఖర్చు అయిందో లెక్కలు వేసి డబ్బులు చెల్లిస్తోంది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా టీడీపీ నేతలు అక్రమంగా ఉపాధి పనులు దక్కించుకుంటూ గ్రామ పంచాయతీ పేరుతో సొమ్ము చేసుకోవడం ఐదేళ్లుగా కొనసాగుతోంది. డబ్బులు తమ పేరుతో మార్చినందుకు టీడీపీ నేతలు వాటాలు చెల్లిస్తున్నారు. గత ఆగస్టు 1వ తేదీ నుంచి సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన రావడంతో టీడీపీ నేతల పని మరింత సులభం అయిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో నిధులు లేకపోయినా గత ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు దాదాపు రూ.1,800 కోట్ల బిల్లులు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందులో రూ.1,615 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలలో జరిగిన పనులతో కలిపి అది రూ.1,920 కోట్లకు చేరుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారితే బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందనే ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కొత్త సర్పంచులు వస్తే టీడీపీ నేతల ప్లాన్‌ బెడిసికొడుతుంది. అందువల్లే బిల్లుల చెల్లింపుల కోసమే సీఎం చంద్రబాబు అత్యవసరంగా మంత్రివర్గ సమావేశ నిర్వహణకు సిద్ధమైనట్లు  అధికారులు పేర్కొంటున్నారు.

అత్యధిక బిల్లులు లోకేష్‌ శాఖలోనే..
ఉపాధి హామీ పెండింగ్‌ బకాయిలుగా చెబుతున్న రూ.1,920 కోట్ల బిల్లుల్లో రూ.1,400 కోట్లు ఒక్క పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా గ్రామీణ రహదారులు, ఇతర నిర్మాణ పనులకు చెల్లించాల్సినవని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలలలో రూ.305 కోట్ల ఉపాధి హామీ మెటీరియల్‌ పనులు జరగగా అందులో రూ.196 కోట్లు పంచాయతీరాజ్‌ రోడ్లు బిల్లులుగా చెబుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, స్కూళ్ల ప్రహరీ గోడల నిర్మాణం, గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణాలు, అటవీశాఖ ఆధ్వరంలో చేపట్టిన మొక్కల పెంపకం కింద రూ.500 కోట్లకుపైగా బిల్లులను టీడీపీ నేతలు చూపిస్తున్నారు.

మరిన్ని వార్తలు