‘జగనన్న విద్యాదీవెన’కు నేడు శ్రీకారం 

28 Apr, 2020 02:54 IST|Sakshi

ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

ఎన్నడూలేని విధంగా మొత్తం ఫీజు రీయింబర్స్‌ 

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి 

టీడీపీ చెల్లించకుండా మిగిల్చిన బకాయిలు రూ.1,880 కోట్లూ చెల్లింపు.. వాటితోపాటు మొత్తం రూ.4వేల కోట్లు విడుదల

సాక్షి, అమరావతి: విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదో గొప్ప శుభవార్త. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ‘జగనన్న విద్యా దీవెన’ను ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌ చేసే పథకం ఇది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు.

ఒకేసారి రూ.4 వేల కోట్లు విడుదల
గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించడంతో పాటు, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది. 2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను టీడీపీ సర్కారు చెల్లించలేదు. ఆ బకాయిలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది. అలాగే, 2019–20 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ రెండేళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.4వేల కోట్లు విడుదల చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఒకేసారి ఇంత పెద్ద మొత్తం విడుదల చేయడం చరిత్రలో ఎన్నడూలేదు. విద్యార్థుల భవిష్యత్‌పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని విద్యావేత్తలు కొనియాడుతున్నారు.  ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే.. ఆ మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా తిరిగి ఇచ్చేసేందుకు కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. 2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా కట్టి ఉంటే.. ఆ సొమ్మును కూడా తిరిగి రాబట్టుకోవాలని తెలిపింది. 

2020–21లో నేరుగా తల్లుల ఖాతాల్లోకి..
ఇదిలా ఉంటే.. రానున్న విద్యా సంవత్సరం 2020–21లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు) డబ్బు వేయనున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక వసతి దీవెన కింద ఏటా రూ.20వేల వరకు తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు