‘కాసు’క్కూర్చున్నారు!

29 Jun, 2020 09:24 IST|Sakshi

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించిన విధులు నిర్వహిస్తున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో వీరి అవసరం చాలా ఉంది. సరిగ్గా దీనినే తమకు అనుకూలంగా మార్చుకున్నారు  విజయవాడ కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది. కాంటాక్ట్‌ ముగిసిన గ్రూపులు కొనసాగాలన్నా.. కొత్త గ్రూపులను తీసుకోవాలన్నా కమీషన్లు దండుకుంటూ కార్మికుల పొట్టగొడుతున్నారు. 

పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అవినీతి కంపు కొడుతోంది. నగరాన్ని శుభ్రం చేసేందుకు నియమించుకున్న పారిశుద్ధ్య కారి్మకుల నుంచి ఈ విభాగంలోని శానిటరీ మేస్త్రీ, ఇన్‌స్పెక్టర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు అందినకాడికి దండుకుంటూ వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. కరోనా కట్టడిలో తొలి వరుసలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల నియామక గడువు ముగిసిందని వారిని కొనసాగించాలంటే తమకు సొమ్ములు ముట్టజెప్పాలని లేదంటే తొలగిస్తామంటూ వార్డులో విధులు నిర్వహించే క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని కారి్మకులు ఆరోపిస్తున్నారు. పాత గ్రూపు కొనసాగింపునకు ఒక్కో గ్రూపుకు రూ. 50 వేలు, కొత్త గ్రూపు రిజి్రస్టేషన్‌కు ఒక్కో గ్రూపునకు రూ. లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. 

అదనపు సిబ్బంది నియామకంలోనూ.. 
కోవిడ్‌ నియంత్రణకు అదనంగా 20 శాతం వర్కర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో నూతన వర్కర్ల నియామకానికీ భారీ స్థాయిలో ముడుపులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి.  

నగరంలో ఇటీవల 20 గ్రూపుల ద్వారా 200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం జరిగింది.

ఇవన్నీ సీఎంఈవై, డ్వాక్రా గ్రూపుల ద్వారా నియమించాలని మార్గదర్శకాలుండగా కొంత మంది అత్యుత్సాహ శానిటరీ మేస్త్రీలు, ఇన్‌స్పెక్టర్లు మనుగడలో లేని గ్రూపుల ద్వారా నియామకాన్ని చేపట్టి అందుకు కార్మికుల నుంచి రూ. లక్షల్లో వసూళ్లు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. 

మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి వీఎంసీ ప్రత్యేకంగా టీఎల్‌ఎఫ్‌(టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌)లకు నిర్వహణ బాధ్యతలు ఇస్తోందన్న సమాచారంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు మరింత దూకుడు పెంచి నిర్ణీత గడువు విధించి మరీ వసూళ్లు చేస్తున్నారని, గడువులోగా ఇవ్వకపోతే పొదుపు సంఘాల రిజిస్ట్రేషన్‌ వాయిదా వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

కొంతమంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లైతే బినామీ గ్రూపులు నిర్వహిస్తున్నారని, గ్రూపులకు సంబంధించి ఎలాంటి రికార్డులైనా, లావాదేవీలైనా, తీర్మానాలైనా వారి నియత్రణలోనే ఉంటున్నాయని తెలుస్తోంది.

అవినీతి రాజ్యమేలుతోంది 
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగంలో అవినీతి రాజ్యమేలుతుంది. జలగల్లా కొంత మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్నారు. చాలా మంది ఇన్‌స్పె క్టర్లు పొదుపు సంఘాల తీర్మానాల పుస్తకాలు, రిజిస్ట్రార్లు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్‌బుక్‌లను స్వా«దీనం చేసుకుని వాటిని నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టీఎల్‌ఎఫ్‌లకు బాధ్యతలు ఇస్తే కొంతమేర నష్టనివారణ జరగే అవకాశం ఉంది.  
– ఎం.డేవిడ్, సీఐటీయూ  నాయకుడు

చర్యలు తీసుకుంటాం.. 
పారిశుద్ధ్య కార్మికుల కొనసాగింపు, కొత్త గ్రూపుల నియామకంలో అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  
– షాలినీదేవి, సీఎంవోహెచ్‌–వీఎంసీ   

మరిన్ని వార్తలు