హామీల్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తాం..

23 May, 2014 02:01 IST|Sakshi
హామీల్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తాం..

 పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర

 కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి సంతకం రైతు రుణ మాఫీ పైనే చేస్తారని పునరుద్ఘాటించారు.
 
సీమాంధ్ర నవనిర్మాణం జరాగాలన్నదే చంద్రబాబు ఏకైక లక్ష్యమని తెలిపారు. పారదర్శక పరిపాలనతో ప్రజా సంపదను కాపాడతామన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓట్లు వేయవద్దని ప్రసంగాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఎలా ఢిల్లీ వెళ్లి ఆయన్ను కలిసారని ప్రశ్నించారు. ప్రజా తీర్పు వెలువడి వారం రోజలు కాకముందే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, కసుకుర్తి మనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు