ప్రజాస్వామ్య పాలనతోనే ప్రగతి

25 Aug, 2018 11:50 IST|Sakshi
మాడభూషి శ్రీధర్‌ ఆచారి

కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచారి

ఎచ్చెర్ల క్యాంపస్‌ : పారదర్శకమైన, ప్రజాస్వామ్య పాలనతో నే దేశ ప్రగతి సాధ్యం అవుతుందని కేంద్ర సమాచార కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచారి అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రజాస్వామ్యంలో పాదర్శక పాలన ప్రాధాన్యత, ప్రస్తుతం సమాచా ర హక్కు చట్టం ప్రాధాన్యతపై విద్యార్థులు, బోధనా సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే పేద ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. పేద ప్రజలు ప్రగతి సాధించా లంటే నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరాలని చెప్పారు. రాజకీయ జోక్యం, లంచాల వ ల్ల సమాజంలో పేదలకు, అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, లబ్ధిదారుల ఎంపిక, ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహక శాఖ పనితీరు ప్రజలు తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా అందుబాటులోకి వచ్చిందన్నారు.

తెల్ల రేషన్‌ కార్డు, రూ. 10 ఖర్చుతో ఎటువంటి అవినీతి అక్రమాలను అయినా ప్రజలు వెతికి తీయవచ్చునన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు ఈ హక్కును ఆయుధంగా ఉపయోగించుకొని అవినీతి పాలకులు, ఆధికారులపై పోరాడాలని సూచించారు. 1990 సంవత్సరం నుంచి సమాచార హక్కు చట్టం కోసం పోరాటం సాగిందని, చివరకు 2005లో అమల్లోకి వచ్చిందని వివరించారు. 20 ఏళ్ల సమాచారం ప్రజలు తీసుకోవచ్చునన్నారు. రేషన్‌ కార్డుకు లంచం అడిగిన అధికారిపై, మైనర్‌ బాలిక కిడ్నాప్‌పై స్పందించని అధికారిపై, లంచాలు. ప్రలోభాలకు సిద్థమై ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చేసిన ఎందరో అధికారులపై సామాన్యులు విజయం సాధించినట్టు శ్రీధర్‌ చెప్పారు.

ప్రభుత్వ పథకాలు అర్హత ప్రామాణికంగా అందజేయకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీయ వచ్చునన్నారు. ప్రస్తుతం సమాజంలో జాగృతి పెరగాలని, అవినీతిని కూకట వేళ్లతో సమాజం నుంచి బయటకు తీయవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్‌ కూన రామ్‌జీ మాట్లాడుతూ విద్యార్థులు సచార హక్కు చట్టం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజస్ట్రార్‌ కురపాన రఘుబాబు, ప్రిన్సిపాల్‌ గుంట తులసీరావు, శ్రీకాకుళం ఆర్డీవో టి.వెంకటరమణ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పి,జగన్నాథరావు, ఎచ్చెర్ల తహసీల్దార్‌ శ్రీనివాసరావు, జిల్లా సమచార హక్కు చట్టం ప్రతినిధి కె.వసంతరావు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు