కిమ్స్‌ సవీరాలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

22 May, 2020 20:09 IST|Sakshi

సాక్షి, అనంతపురం: రాయలసీమలో అందులోనూ అనంతపురం ప్రాంతంలో అత్యున్నత వైద్యసేవలు అందిస్తామన్న తమ హామీని నిలబెట్టుకుంటూ.. కిమ్స్ సవీరాలోని వైద్యులు సమీప గ్రామం నుంచి వచ్చిన 58 ఏళ్ల హృద్రోగికి ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)ని అమర్చి, అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇది ఈ ప్రాంతంలో అమర్చిన మొట్టమొదటి ఐసీడీ కావడం విశేషం. వెంట్రిక్యులర్ అరిథమియాస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి కారణంగా ఉన్నట్టుండి గుండె ఆగిపోయే ముప్పు ఉన్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ పరికరాన్ని ఉపయోగిస్తారు. కిమ్స్ సవీరాలోని గుండె వైద్యుల బృందంలోని కన్సల్టెంట్ ఇన్వేజివ్ కార్డియాలజిస్టు డాక్టర్ వి.రాకేష్ నాయక్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఈ పరికరాన్ని తమ నైపుణ్యం, అత్యంత కచ్చితత్వంతో అమర్చారు.

కుమార్(58) అనే బాధితుడు తరచు తనకు మైకం కమ్ముతోందని చూపించుకోడానికి కిమ్స్ సవీరా ఆసుపత్రికి వచ్చారు. గతంలో అనేక చోట్ల వైద్యం చేయించుకున్నా.. మెదడుకు ఎంఆర్ఐ, ఈఈజీ వంటి పరీక్షలు చేసినా ఏమీ తేలలేదు. దాంతో చివరకు కిమ్స్ సవీరా ఆసుపత్రిని సంప్రదించగా.. ఆయనకు హైపర్ ట్రాఫిక్ అబ్ స్ట్రక్టివ్ కార్డియోమయోపతీ అనే వ్యాధి వల్ల గుండె కండరాలు (మయోకార్డియమ్) బాగా మందంగా అయిపోయినట్లు తేలింది. దానివల్ల గుండె రక్తాన్ని సరఫరా చేయడం కష్టం అయిపోతుంది. దీనివల్ల ఉన్నట్టుండి మరణం సంభవించే ప్రమాదం ఉండటంతో దాన్ని అరికట్టేందుకు ఐసీడీ అమర్చాలన్న నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై కిమ్స్ సవీరా ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఇన్వేజివ్ కార్డియాలజిస్టు డాక్టర్ వి.రమేష్ నాయక్ మాట్లాడుతూ.. గుండెవైద్యంలో కిమ్స్ సవీరా ఆసుపత్రి మంచి పురోగతిని సాధిస్తోంది. అనంతపురంలో ఐసీడీ అమర్చడం ఇదే తొలిసారి కావడంతో, ఇలా ఉన్నట్టుండి మరణం సంభవించే ప్రమాదమున్న చాలామంది రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో ఇలా ఉన్నట్టుండి గుండె ఆగి మరణించడం చాలా పెద్ద ప్రజారోగ్య సమస్య. పరుగు తీసేటప్పుడు, ఫుట్ బాల్ ఆడేటప్పుడు కూడా కొందరు ఉన్నట్టుండి మరణించడానికి ఇదే కారణం. ఇలాంటి రోగులకు డీఫిబ్రిలేటర్లను అమర్చడమే సరైన పరిష్కారం. ఇలాంటి మరణాలను అది చాలా సమర్థంగా తగ్గిస్తుంది' అని ఆయన వివరించారు.

ఇదే కేసు గురించి కిమ్స్ సవీరా ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ సమస్యను గుర్తించగానే రోగిని ముందుగా లూప్ ఈసీజీ పర్యవేక్షణలో ఉంచాం. అక్కడ 5 రోజుల పాటు ఆయన ఈసీజీని రికార్డు చేశాం. ఈ రోజుల్లో ఆయన తన రోజువారీ పనులు మామూలుగానే చేసుకున్నారు. ఈ పరీక్ష ఫలితాల్లో ఆయనకు వెంట్రిక్యులర్ టాకీకార్డియా (గుండె వేగంగా కొట్టుకోవడం - నిమిషానికి 280 సార్లు) 12 సెకండ్లపాటు ఉంటోందని గుర్తించాం. అందుకే ఆయనకు ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ అమర్చాలని నిర్ణయించాం. ఈ రోగికి డ్యూయల్ ఛాంబర్ ఐసీడీ అమరికను విజయవంతంగా పూర్తిచేశాం' అని తెలిపారు.

కుటుంబ సభ్యుల ధన్యవాదాలు:
రోగి కోలుకోవడంతో ఆయన కుటుంబసభ్యులు చాలా సంతోషించారు. మా నాన్నకి కొత్త జీవితాన్ని అందించినందుకు కిమ్స్ సవీరా వైద్య బృందానికి ధన్యవాదాలు. ఇంతకుముందు ఇలాంటి చికిత్స బెంగళూరు లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఉండేది. ఇప్పుడు అనంతపురంలోనూ ఈ చికిత్స అందుబాటులోకి రావడంతో, విలువైన కాలంతో పాటు బోలెడంత ఖర్చు కూడా రోగులకు ఆదా అవుతుంది అని బాధితుని కుమారుడు చెప్పారు. చికిత్సకు సంబంధించిన వివరాలకు 9963445785 మొబైల్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. 

మరిన్ని వార్తలు