గడిచిన 10 నెలల్లో 1.13 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు
అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 19వేల మందికి పైగా బాధితులు
రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాలోనూ ఎక్కువే
ఎక్కువ మంది చిన్నారులే బాధితులు
సగటున రోజుకు 387 మందికి కుక్కకాటు
సాక్షి, అమరావతి : ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయం.. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు చీకటి పడితే చాలు కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వెంటాడి.. వేటాడి మరీ కరుస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. అందరిదీ ఇదే సమస్య. హఠాత్తుగా మీదపడి ఎక్కడ కాటేస్తాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చిన్నారుల పాలిట యమపాశాలవుతున్నాయి. వీటి బారినపడి మృత్యువాత పడిన ఘటనలూ అనేకం. ఇలాంటి విషాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా సమస్య పరిష్కారంపై అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. రాష్ట్రవ్యాప్తంగా కుక్కల భయం జనాన్ని వణికిస్తోంది. సగటున రోజుకు 387 మంది కుక్క కాటుతో వివిధ ఆస్పత్రులకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయ్యొచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఆసుపత్రుల వరకు రాని కేసులు వీటికి అదనం. వారం రోజుల కిందట కడప చిన్నచౌక్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తుండగా ఏడుగురు స్కూలు విద్యార్థులను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. అలాగే, విజయవాడలో అయితే రోజూ పదుల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్నిచోట్లా కుక్కకాటు బాధితులు నిత్యం నమోదు అవుతూనే ఉన్నారు. సకాలంలో ఆస్పత్రికి వెళ్లకపోతే దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం.
పట్టణాల్లోనే ఎక్కువ..
కుక్కకాటు బాధితుల సంఖ్య పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, కర్నూలు వంటి నగరాల్లో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వాస్తవానికి కుక్కలను చంపకూడదని చట్టం చెబుతోంది. దీనిబదులు వాటికి స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ) విధిగా చేయాలి. కానీ, ఈ పనిచేయాల్సిన మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు దీనిపై దృష్టిపెడుతున్న దాఖలాలు చాలా తక్కువే. గత కొన్ని నెలలుగా మున్సిపల్ శాఖ ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో బాధితుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది. కాగా, కుక్క కాటుకు గురవుతున్న వారిలో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం.
కుక్కల సంఖ్యపై కాకిలెక్కలు
పట్టణాల్లో లక్షా 55వేల కుక్కలు మాత్రమే ఉన్నాయని మున్సిపల్ శాఖ చెబుతోంది. వీటిలో ఇప్పటివరకూ 1.30 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ చేశామని, ఇంకా పాతిక వేల కుక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ శాఖ చెబుతోంది. కానీ, తాజా లెక్కల ప్రకారం కేవలం పట్టణాల్లోనే 3 లక్షల కుక్కలకు పైగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుక్కల నియంత్రణ అంశాన్ని మున్సిపల్ శాఖ పూర్తిగా విస్మరించడంతో వాటి బాధ భరించలేక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.
48 నెలల్లో ఎప్పుడైనా రేబిస్!
ఇదిలా ఉంటే.. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ వ్యాధి 14 రోజుల నుంచి 48 నెలల్లోపు ఎప్పుడైనా సోకవచ్చు. చిన్న గాటు కూడా పడలేదని సాధారణంగా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ, రేబిస్కు కారణమయ్యే వైరస్ అత్యంత ప్రమాదకారి. నెమ్మదిగా వ్యాపిస్తుంది. నిర్లక్ష్యం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ వైరస్ నరాల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. కాగా, భుజం, మెడ, వీపు.. ఇలా ఏదైనా తలకు సమీపంలో గాటు పడితే రేబిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకి సురక్షితంగా బయటపడిన దాఖలాలు లేవు.
కుక్క కరిస్తే ప్రాథమిక చికిత్స ఇలా..