ఎట్టకేలకు..!

5 Jan, 2014 05:44 IST|Sakshi

 బెల్లంపల్లి, న్యూస్‌లైన్ :
 జిల్లాలో సంచలనం సృష్టించిన బెల్లంపల్లికి చెందిన రూ.100 కోట్ల విలువైన భూముల మాయ వ్యవహారంపై కోర్టు స్పందించింది. అ వకతవకల వ్యవహారంలోప్రభుత్వ ఉద్యోగులపై పోలీసు కేసుకు ఆదేశించింది. తప్పుడు జీవోలు, నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ చేయడం, అవకతవకలకు పాల్పడటం, వంచనకు గురి చేయడం వంటి పలు ప్రధాన సెక్షన్లతో సస్పెన్షన్‌కు గురైన బి.విశ్వంభర్(కౌటాల తహశీల్దార్), రోహిత్‌దేశ్‌పాండే (జైనూర్ డిప్యూటీ తహశీల్దార్), ముడిమడుగుల వెంకట్రావ్ (మందమర్రి వీఆర్వో), మణిరాజ్ (మండల సర్వేయర్ నెన్నెల), రాంనర్సయ్య (రిటైర్డ్ డీఎఫ్‌వో, బెల్లంపల్లి)పై కేసు నమోదు చేయాల్సిందిగా బెల్లంపల్లి పోలీసులకు ఆసిఫాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సదరు ప్రభుత్వ రెవెన్యూ అధికారులపై బెల్లంపల్లి టూటౌన్‌లో శనివారం కేసు నమోదైంది. సదరు ఉద్యోగులపై ఐపీసీ 200, 409, 468, 471, 482, 488, 420, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి టూటౌన్ ఎస్‌హెచ్‌వో మహేశ్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు.
 
 వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’..
 బెల్లంపల్లిలోని కాల్‌టెక్స్ భూముల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. 2012 ఆగస్టు 6వ తేదీన ‘భూమాయ’, 2012 ఆగస్టు 12వ తేదీన ‘భూకైలాస్’ శీర్షికలతో జిల్లా టాబ్లాయిడ్‌లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కన్నాల శివారులోని సర్వే నంబర్ 108, 109, 110/1, 111లలో  హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నలుగురితో సహా పరాయి దేశంలో నివసిస్తున్న ఓ మహిళ, మరికొందరి పేరుపై సు మారు 248.28 ఎకరాల భూములు ఉన్నట్లు సదరు రెవెన్యూ ఉద్యోగులు 2011 జనవరి 13వ తేదీన ప్రొసిడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రకారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి మొదలుకుని ప్రభుత్వాస్పత్రి వరకు ఉన్న భూములన్నీ సదరు వ్యక్తులవేనని రెవెన్యూ అధికారులు ప్రొ సిడింగ్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. డీఎఫ్‌వో కార్యాలయం, టూటౌన్, ట్రాన్స్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్, ఇతర స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న భూములన్నీ కూడా ప్రొసిడింగ్స్‌లో జారీ చేసి వ్యక్తులవేనని సుస్పష్టం చేయడంతో ఒక్కసారిగా కల కలం రేగింది. దీంతో ‘సాక్షి’లో వచ్చిన వార్తా కథనాల క్లిప్పింగ్‌లను ఆధారం చేసుకొని బెల్లంపల్లికి చెందిన కొందరు కలెక్టర్ అహ్మద్‌బాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
 
  బాధితుల ఫిర్యాదుకు స్పందించిన కలెక్టర్ బెల్లంపల్లిలోని కాల్‌టెక్స్ భూముల అక్రమాలపై  విచారణ చేయాల్సిందిగా అప్పటి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటయ్య (ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు)ను ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ జాయింట్ కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదికను సమర్పించారు. అడిషనల్ జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రూ.100 కోట్ల విలు వ చేసే భూముల అక్రమాల డొల్లతనం బయటపడింది. ఈ మేరకు కలెక్టర్ నలుగురు రెవె న్యూ ఉద్యోగులపై వేటు వేశారు. బెల్లంపల్లిలో అప్పట్లో పనిచేసిన తహశీల్దార్ విశ్వంభర్, డిప్యూటీ తహశీల్దార్ రమేశ్‌బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే, వీఆర్వో ముడిమడుగుల వెంకట్రావ్‌ను సస్పెండ్ చేశారు.
 
 కోర్టు ఆదేశాలతో...
 కాల్‌టెక్స్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడిన వైనాన్ని బెల్లంపల్లికి చెందిన కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో ఫిటిషన్ వేయడంతో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్న ట్లు గుర్తించి సదరు కోర్టు తొలుత దిగువ స్థాయి కోర్టుకు వెళ్లాల్సిందిగా పిటిషన్‌దారులకు సూ చించింది. దీంతో సదరు పిటిషన్‌దారులు ఆసిఫాబాద్‌లోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లా రు. ఫిటిషన్‌ను స్వీకరించిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కేసు పూర్వపరాలను పరిశీలించి భూముల అక్రమాలకు పాల్పడిన నలుగురు రెవెన్యూ ఉద్యోగు లు, ఆ భూముల వ్యవహారంలో ఉద్యోగులకు సహకరించిన రిటైర్డ్ డీఎఫ్‌వోపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
 
 కలెక్టర్ స్పందించడంతో...
 భూముల మాయపై కలెక్టర్ అహ్మద్‌బాబు సీరి యస్‌గా స్పందించడంతోనే అక్రమార్కుల గుట్టు రట్టైంది. సకాలంలో స్పందించిన కలెక్టర్ అడిషనల్‌జాయింట్ కలెక్టర్‌తో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల భూ భాగోతం బట్టబయలైంది. దీంతో రూ.100 కోట్లకుపైబడి విలువ చేసే భూములు బినామీల పరం కాకుండా నిలిచిపోయాయి. భూముల అక్రమాలను సహించలేని కలెక్టర్ చివరికి రెవెన్యూ ఉద్యోగులను సస్పెన్షన్ చేసి అక్రమార్కులకు దడ పుట్టించారు.

మరిన్ని వార్తలు