నేటి నుంచి యథావిధిగా ‘డయల్ యువర్ కలెక్టర్’

2 Jun, 2014 02:38 IST|Sakshi

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు సోమవారం నుంచి యథావిధిగా నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల సమయం కావడంతో జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించలేకపోయింది.

 అయితే ఈనెల 2వ తేదీ నుంచి డయల్  యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్‌లు యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామని, ఫోన్ ద్వారా నేరుగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. 08518-277100 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరిస్తే కలెక్టర్ వెంటనే స్పందిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజాదర్బార్ కూడా యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు