ప్రభుత్వ నియామకాల్లో ‘తమ్ముళ్ల’ జోక్యం

6 Sep, 2014 03:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రభుత్వ నియామకాల్లో తెలుగు తమ్ముళ్ల జోక్యం పెరుగుతోంది. ఉద్యోగులుగా ఎవరిని నియమించాలో, ఎవరిని నియమించ కూడదో ఆదేశాలు జారీ చేస్తున్నారు. టీడీపీ నేతల మితిమీరిన జోక్యాన్ని ప్ర భుత్వ అధికారులు భరించలేకపోతున్నా రు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. జిల్లాలో వీరు 116 మంది ఉన్నారు. మరో 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కూడా తొలగించారు.
 
   వీరు మూడు వారాలుగా నెల్లూరులో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అందరూ హైదరాబాద్ వెళ్లి సీఎం చంద్రబాబును కలిశారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, సీనియారిటీని బట్టి సగం మందికి అవకాశం ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీనియారిటీ ప్రకారం ఎవరిని నియమించాలనే విషయంలో ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ)కి అధికారమిచ్చారు. గత ప్రభుత్వం మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున 116 మందిని నియమించింది. ప్రస్తుతం వీరిలో దాదాపు సగం మందికే అవకాశం ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే తాము ఎవరి పేర్లు సూచిస్తే వారినే నియమించాలని తెలుగు తమ్ముళ్లు పీడీ దగ్గర వాదిస్తున్నారు. మొత్తం జాబితాను తమకు ఇస్తే, వాటిలో తమకు కావలసిన వారి పేర్లను తెలియజేస్తామని, వారిని మాత్రమే నియమించాలని శాసిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు దిక్కు తోచని పరిస్థితికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి అవకాశం ఇవ్వకూడదని బెదిరిస్తున్నారు. రాజకీయంగా విభేదాలు వస్తే సీనియర్లతో సంబంధం లేకుండా కొత్త వారిని నియమించేం దుకు ప్రయత్నిస్తున్నారు.
 
 ఇదెక్కడి న్యాయమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఉద్యోగి మాట్లాడుతూ పదేళ్లుగా పని చేస్తున్న తమను తీసి వేసి, టీడీపీ కార్యకర్తలను నియమించుకునేందుక ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వం నియమించిన ఉద్యోగులను తొలగించ డం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇదే కొనసాగితే కలెక్టరేట్ ఆందోళన చేపట్టడానికి వెనకాడబోమని హెచ్చరించా రు. తెలుగు తమ్ముళ్ల పెత్తనం ఈ ఉద్యోగాల విషయానికే పరిమితం కాలేదని, వివిధ శాఖల్లో నియామకాల పేరుతో ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తెలుగు తమ్ముళ్లకే నియామక అధికారాలు ఇస్తే, తాము ఇంట్లో కూర్చోవడం మేలని అధికారులు పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు