చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

21 Nov, 2023 10:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడికి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పూర్తిస్థాయి బెయిల్‌గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తాత్కాలిక బెయిల్‌ సందర్భంగా జారీచేసిన బెయిల్‌ బాండ్‌ ఆధారంగా చంద్రబాబును విడుదల చేయాలని ఆదేశించింది. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడంగానీ చేయరాదంటూ అప్పట్లో విధించిన షరతులను హైకోర్టు సడలించింది.

అయితే, బెయిల్‌ విషయంలో సుప్రీంకోర్టు నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, పరిధి దాటినట్లనిపిస్తోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. చంద్రబాబు నాయుడు లేవనెత్తని పలు అంశాల జోలికి హైకోర్టు వెళ్లింది. వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండకూడదు. అందువల్ల హైకోర్టు తీర్పు లోపభూయిష్టం. బెయిల్‌ దశలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించింది. ఆధారాల గురించి హైకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాల విషయంలో పరిధి దాటింది. దర్యాప్తు కొనసాగుతుండగా దర్యాప్తులో లోపాలను ప్రస్తావించింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణను అడ్డంపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు అడ్డుగోడలా నిలిచాయి.

సీఐడీ కోరిన వివరాలు ఏ మాత్రం అందజేయలేదు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి తీర్పునివ్వడం ద్వారా కింది కోర్టు అధికారాల్లో హైకోర్టులో జోక్యం చేసుకున్నట్లయింది. వాస్తవానికి బెయిల్‌ కేసుల్లో కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లకూడదు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగే సమయంలో చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలను వినిపించలేదు. దీనిపై సీఐడీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ అభ్యంతరాన్ని హైకోర్టు రికార్డ్‌ కూడా చేసింది. ఈ బెయిల్‌ పిటిషన్‌ విషయంలో హైకోర్టు తీరు అసాధారణం. ఆరోపణలు, దర్యాప్తుపై కింది కోర్టు చేయాల్సిన పూర్తిస్థాయి ట్రయిల్‌ను హైకోర్టు నిర్వహించినట్లయింది.’ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
చదవండి: స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి 

మరిన్ని వార్తలు