సూర్య 'కంగువా' చిత్రంపై భారీ అంచనాలు పెంచేలా నిర్మాత వ్యాఖ్యలు

21 Nov, 2023 06:40 IST|Sakshi

కోలీవుడ్‌ అగ్ర నటుడు సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తోంది.  భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో సూర్య అత్యంత పరాక్రమవంతుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతుంది. తాజాగా ‘కంగువా’ను ఉద్దేశించి చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చేసిన వ్యాఖ్యలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి.

'కంగువా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ముందుగా కేవలం 10 భాషల్లో మాత్రమే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కంగువా చిత్రాన్ని ఏకంగా 38 భాషల్లో రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా  ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులోకి తెస్తున్నాం. కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతుంది.' అని జ్ఞానవేల్‌ రాజా అన్నారు. కంగువ  కలెక్షన్స్‌ విషయంలో సినిమా లక్ష్యం రూ.1000 కోట్లని చిత్ర నిర్మాతల్లో మరోకరు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు భారీగా పెరిగాయి. 

ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో దిశా పఠానీతో పాటు బాబీ దేవోల్‌, జగపతి బాబు, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. 2024 వేసవి సమయంలో ఈ చిత్రం విడుదల కానుంది. పార్ట్‌-1 హిట్‌ అయితే పార్ట్‌-2 కూడా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు