అభివృద్ధికి సహకరించని ప్రభుత్వం

31 May, 2016 09:41 IST|Sakshi
అభివృద్ధికి సహకరించని ప్రభుత్వం

అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కర్నూలు ఎంపీబుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె దత్తత తీసుకున్న తన తండ్రి స్వగ్రామం పుల్లగుమ్మిని సందర్శించారు.  - ఎంపీ బుట్టా రేణుక


వెల్దుర్తి రూరల్: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కర్నూలు ఎంపీ బుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. తాను దత్తత తీసుకున్న తన తండ్రి స్వగ్రామం పుల్లగుమ్మిని సోమవారం ఆమె సందర్శించారు. ఎంపీ నిధులతో నిర్మిస్తున్న రోడ్లు ముందుకు సాగకపోవడంతో పీఆర్ ఏఈ అచ్యుతానందరెడ్డిని వివరాలు అడిగి తెసుకున్నారు. మరో 30 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు.. ఎన్‌ఆర్‌ఇజియస్‌తో కలిపి మొత్తంగా గ్రామానికి కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు ఉన్నాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఏఈని ఆదేశించారు.  గ్రామంలో సభను నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామంలో వీధి వీధి తిరిగి సమస్యలను గుర్తించారు. పాఠశాలలకు డెస్క్‌లు లేకపోవడం గమనించారు. బస్‌సెల్టర్ నిర్మాణం, కరెంటు స్తంభాల అవసరం గుర్తించారు. పుల్లగుమ్మి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని..అందుకు ప్రజలు సహకరించాలన్నారు.
 
 అభివృద్ధికి మోకాలడ్డు
కేంద్ర ప్రభుత్వం తరఫున తాను నాగులదిన్నె గ్రామాన్ని, రాష్ట్రప్రభుత్వం తరఫున పుల్లగుమ్మి గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ఎంపీ బుట్టా రేణకు తెలిపారు. వాటికి 50 లక్షల రూపాయలకు మించి నిధులు విడుదల చేయించి అభివృద్ధి చేస్తున్నా.. రాష్ట్రప్రభుత్వం సహకారం అందించడం లేదన్నారు. ఒక్క పని కూడా రాష్ట్ర సహకారంతో జరిగింది లేదన్నారు.  కేంద్రప్రభుత్వంతో.. ప్రిన్స్‌పల్ సెక్రటరీలతో తాను వివిధ దశల్లో మాట్లాడిన ఫలితంగా హంద్రీనీవా పనులు, అభివృద్ధి పనులు కొద్దిగానైనా ముందుకు సాగుతున్నాయన్నారు.

తాను చేస్తున్న అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం మోకాలడ్డడం వింతగా కనిపిస్తోందన్నారు. అభివృద్ధి పట్ల అధికార పార్టీ నాయకులు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.   సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్  చెరుకులపాడు నారాయణరెడ్డి, తహసీల్దార్ శారద, ఎంపీడీవో అబ్దుల్ వహీద్, వైఎస్‌ఆర్‌సీపీ మండల నాయకులు బొమ్మన సుబ్బారెడ్డి,  శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు