‘వై ఏపీ నీడ్స్ జగన్’లో బామ్మ
ద్వారకా తిరుమల: ‘ఈ మనవడు నాకెందుకు తెలీదు. నా పెద్ద మనవడే. వయసులో చిన్నోడైనా నాలాంటి ముసలోళ్లతోపాటు ఎంతోమంది పేదల జీవితాల్లో భరోసా నింపుతున్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నేనే కాదు. రాష్ట్రంలోని అందరూ ఆయనకే ఓటేస్తారు. ఈసారి కూడా నా మనవడు జగనే సీఎం అవుతాడు’ అంటోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన ముద్దన ముస్సెమ్మ.
గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దొరసానిపాడులో ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. ఈ సందర్భంలో ముద్దన ముస్సెమ్మ అనే వృద్ధురాలు తారసపడగా.. ఎమ్మెల్యే ఆమెతో ముచ్చటించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కరపత్రంపై ఉన్న సీఎం జగన్ ఫొటోను బామ్మకు చూపి ‘ఈయన ఎవరో గుర్తు పట్టావా’ అని అడిగారు.
అది చూసిన ముస్సెమ్మ విప్పారిన కళ్లతో ‘నా మనవడు నాకెందుకు తెలీదు. జగన్ మనవడి వల్లే సంతోషంగా బతుకుతున్నా. జగన్బాబే లేకపోతే మాలాంటి వాళ్ల బతుకులు ఏమైపోయేవో. ఆయన దయవల్ల ఎందరో పేదల బతుకులు బాగుపడ్డాయ్. మా అందరి ఆశీస్సులతో మళ్లీ నా మనవడే సీఎం అవుతాడు’ అంటూ అమితానందంతో జవాబిచ్చింది.
చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త!