ఇసుక తవ్వకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

13 Apr, 2020 11:11 IST|Sakshi
కొవ్వూరు మండలంలో ఔరంగబాద్‌ ఇసుక ర్యాంపు

నేటి నుంచి తెరుచుకోనున్న ఇసుక ర్యాంపులు

కేవలం నాడు–నేడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులకే సరఫరా 

సాక్షి, కొవ్వూరు: జిల్లాలో ఇసుక తవ్వకాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేవలం నాడు–నేడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం పనులకు మాత్రమే ఇసుక సరఫరా చేయనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని డోర్‌ డెలివరీ పథకానికి ప్రస్తుతానికి అనుమతి లేదని అధికారులు చెప్పారు. ముందస్తుగా స్టాకు యార్డులకు ఇసుక తరలించి నిల్వ చేయడం ద్వారా వర్షకాలంలో ఇసుక కష్టాలను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ర్యాంపులను తెరిచి ఇసుకను స్టాక్‌ యార్డులకు తరలిస్తున్నారు. గండేపల్లి, జగ్గంపేటలతో పాటు జిల్లాలోని తాడేపల్లిగూడెం స్టాకు యార్డుకి ఇసుక చేరవేస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా గత నెల 22 నుంచి నిలిచిన తవ్వకాలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఇసుక ర్యాంపుల్లో పడవ యాజమానులతో కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. వాడపల్లి, ఔరంగబాద్, ఏరినమ్మ, కొవ్వూరు, దండగుండరేవు, ఆరికిరేవుల, దండగుండ రేవు, కొవ్వూరు–1 ర్యాంపుల నిర్వహణ సొసైటీలతో సమీక్షించారు. ర్యాంపులో సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ లు ధరించడం వంటి నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. కాగా జిల్లాలో పోలవరం, తాడిపూడి, ప్రక్కిలంక, గుటాల ర్యాంపులు వారం రోజుల క్రితమే తెరిచారు. నాడు–నేడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులకు సరఫరా చేస్తున్నారు.  జ

స్టాకు యార్డుల ఏర్పాటు  
జిల్లాలో తాడేపల్లిగూడెం స్టాకుయార్డుకి తూర్పు గోదావరి జిల్లా నుంచి మూడు రోజుల్లో 35 వేల టన్నుల ఇసుక తరలించారు. సోమవారం నుంచి ఐ.పంగిడిలో నూతనంగా స్టాకు యార్డు ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో భీమవరం, ఉండి, కాపవరం వంటి స్టాకు యార్డులకు ఇసుక తరలిస్తాం.  
–కె.మనోరంజన్‌ రెడ్డి, ఏపీఎండీసీ జిల్లా ఇన్‌చార్జ్‌

మరిన్ని వార్తలు