గురుకులాల్లో కంప్యూటర్ విద్య

9 Aug, 2015 01:46 IST|Sakshi

♦ విద్యార్థులకు పౌష్టికాహారం అందజేసేందుకు రూ.80 కోట్లు కేటాయింపు
♦ మంత్రి రావెల కిషోర్‌బాబు
 
 నూజివీడు : సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లోని విద్యార్థులకు సంతృప్తికరమైన ఆహారం అందించేందుకు, పౌరసరఫరాల శాఖ నుంచి నాణ్యమైన బియ్యం అందించేందుకు రూ.80 కోట్లు కేటాయించినట్లు  రాష్ట్ర సాంఘిక , గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాలను శనివారం రాత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రన్న చేయూత పథకం కింద గురుకుల పాఠశాలల్లో ఆంగ్లబోధన, కంప్యూటర్ విద్య, ఉన్నతమైన సౌకర్యాలు అందించనున్నామన్నారు. 

ఇప్పటికే ప్రతి గురుకుల పాఠశాలలో  కంప్యూటర్‌విద్యను నిర్వహించేందుకు ఒక్కొక్క దానికి రూ.10లక్షలు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు మాట్లాడుతూ  ప్రస్తుతం గురుకుల పాఠశాలలో మురుగునీటి సమస్య ఉందని, ఈ సమస్యను తొలగించాలన్నారు. అలాగే నూజివీడులో స్టేడియం నిర్మాణం చేయాల్సి ఉందని,  దీనికి సంబంధించిన భూమి కోర్టు వివాదాలలో ఉందని, స్టే ఎత్తివేయడానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్  గద్దె అనూరాధ, నూజివీడు మున్సిపల్ చైర్‌పర్సన్ బసవా రేవతి, ప్రిన్సిపాల్  తాళ్ళూరు ఉమాదేవి, ఎంపీపీ తొమ్మండ్రు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బాణావతు రాజు , టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు