ఒంటిమిట్ట వేడుకల్లో అపశ్రుతి.. నలుగురి మృతి

30 Mar, 2018 20:02 IST|Sakshi

పెరుగుతున్న మృతుల సంఖ్య.. పలువురికి గాయాలు

ఈదురు గాలుల ధాటికి లేచిపోయిన టెంట్లు, రేకులు

వర్షం కారణంగా కడపలో ఆగిపోయిన సీఎం

సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన మృత్త్యువాత పడ్డ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ నలుగురు మృత్యువాత పడ్డారు. ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురుస్తుండటంతో నవమి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోదండరాముడి వేడకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షం కారణంగా ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. ఆలయం వద్ద ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడుతుండటంతో ఆలయ సమీపంలో ఉన్న చెట్టు నేలకొరిగింది.

ఈదురు గాలుల ధాటికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో బద్వేలుకు చెందిన చిన్న చెన్నయ్య మృత్యువాత పడ్డాడు. పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య తొక్కిసలాటలో మరణించగా, దక్షిణ గోపురం వద్ద బారికేడ్స కొయ్యలు పడి వెంకట సుబ్బమ్మ అనే మహిళ మృతి మరణించింది. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీనా అనే మహిళ సైతం ప్రాణాలు కోల్పోయింది. ఆలయానికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ గాలికి ఎగిరిపడి బోయినపల్లికి చెందిన భాస్కర్‌, నందలూరుకు చెందిన ధనుంజయ్‌ నాయుడులకు స్వల్పగాయాలయ్యాయి. అయితే వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పక్కనే ఉన్న హరిత హోటల్‌కు వద్దకు చేరుకుంటున్నారు. బలమైన గాలుల వీస్తుండంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లా చెదరుయ్యాయి. కల్యాణం వీక్షించడానికి వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడగండ్లు, ఈదురు గాలులు కారణంగా విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఒంటిమిట్ట, ఆలయంలో అంధకారం అలముకుంది.


రేకులు మీద పడటంతో గాయపడిన భక్తుడు



పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ :
ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లా పర్యటన సందర్భంగా కడప పోలీసులు స్వామి భక్తి చాటుకొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. గురువారం నుంచే కడపలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రయల్‌ రన్‌ అంటూ గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరచారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి బస చేసే ప్రాంతంలో దుకాణాలు అన్నింటినీ బలవంతంగా మూసేయించారు. ఈ విషయాన్ని స్థానిక నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో కర్నూలు రేంజ్‌ డీఐజీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సంతాపం తెలిపిన వైఎస్ జగన్

ఒంటిమిట్ట ‍ శ్రీరామ నవమి వేడుకలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ సంతాపం ‍తెలిపారు. 

మరిన్ని వార్తలు