సాక్షి, హైదరాబాద్: గాడిద మాంసాన్ని కూడా అమ్మేస్తున్నారా.. గాడిదల్ని కూడా వదలట్లేదా.. అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గుంటూరులో రోడ్లపైనే గాడిదల్ని వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం ఉమ్మడి హైకోర్టు విచారించింది.
కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ముగ్గురు దాఖలు చేసిన పిల్ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కబేళాలను మూసేయాలన్న ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదో తెలియజేయాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ధర్మాసనం ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.