భార్యను కడతేర్చిన భర్త

12 Apr, 2016 01:38 IST|Sakshi
భార్యను కడతేర్చిన భర్త

కాకినాడ రూరల్ : వివాహేతర బంధానికి అడ్డొస్తుందన్న నెపంతో భార్యను కడతేర్చాడు భర్త. కాకినాడ విద్యుత్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనలో కిలిం నూకరత్నం దేవి( 27) బలైంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రతాప్‌నగర్‌కు చెందిన పచ్చిపాల సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నూకరత్నందేవి విజయవాడ గవర్నర్‌పేటలో సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. రమణయ్యపేటకు చెందిన కిలిమ్ శ్రీనివాసరావు కాకినాడ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాదిన్నర బాబు ఉన్నాడు.

విద్యుత్‌నగర్‌లోని నాన్సిస్ట్రీట్‌లో ఉన్న ఓ అపార్‌‌టమెంట్‌లో శ్రీనివాసరావు, నూకరత్నందేవి ఉంటున్నారు. ఉద్యోగరీత్యా నూకరత్నందేవి వారానికి ఒకసారే కాకినాడకు వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన నూకరత్నం దేవి అప్పుడప్పుడూ భర్తను నిలదీసేది. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లొచ్చాక వీరిమధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో శ్రీనివాసరావు తన భార్యను కొట్టి, తువాలును ఆమె మెడకు బిగించి చంపేశాడు.

అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న నూకరత్నందేవి తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఆస్పత్రిలో చేర్చాం’ అని చెప్పాడు. తండ్రి, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా, నూకరత్నందేవి చనిపోయి ఉంది. గొంతు నుమిలినట్టు ఉండడం, అపార్‌‌టమెంట్‌లో తువాలు చుట్టి ఉండడంతో.. ఆమెను హతమార్చారని నిర్ధారణకు వచ్చిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మురళీకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు