విష జ్వరంతో బాలుడి మృతి

4 Sep, 2014 02:19 IST|Sakshi

నందవరం: ముగతి గ్రామంలో వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్న స్టిఫెన్(4) అనే బాలుడు బుధవారం కోలుకోలేక మృతి చెందాడు.     గ్రామానికి చెందిన గోపాల్, మంగమ్మ దంపతుల రెండో కుమారుడు స్టిఫెన్‌కు వారం రోజుల కిందట జ్వరం సోకింది. రెండు రోజులుగా స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో బాలుడ్ని చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించగా కోలుకోలేక చివరకు మృత్యువాత పడ్డాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రెండు రోజుల క్రితం శివన్న అనే వ్యక్తి డెంగీ లక్షణాలతో మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో బాలుడిని విష జ్వరం బలిగొనడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు