మంత్రి ఇలాకాలో మొక్కుబడి

27 Jul, 2014 01:41 IST|Sakshi

 చీపురుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతా న్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమం సాక్షాత్తు జిల్లా మంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో మొక్కుబడిగా సాగుతోంది. మంత్రి కిమిడి మృణాళిని పట్టణంలోనే ఉన్నప్పటికీ బడి పిలుస్తోంది  కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం అమలు చేసేందుకు మండల కమిటీ ఉన్నప్పటికీ వారు వెళ్లిన చోట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇతర పాఠశాలల పరిధిలో ఎవరూ పట్టించుకోవడం లేదు.
 
 బడిపిలుస్తోంది కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రతి పాఠశాల పరిధిలోనూ ర్యాలీ నిర్వహించాలి, అంతేకాకుండా పాఠశాలల పరిధిలో స్థానికులు, ప్రజాప్రతినిధులతో గ్రామసభ నిర్వహించి బడిబయట పిల్లలు ఉండకూడదని అవగాహన కల్పించాలి. చీపురుపల్లి మేజర్ పంచాయతీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు దాదాపు పది వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఎక్కడా ర్యాలీ గానీ, గ్రామసభ గానీ జరగలేదు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలైన అలజంగి, పేరిపి, కరకాం, పి.కె.పాలవలస, రామ లింగాపురం, వంగపల్లిపేట పాఠశాలలు మినహాయిస్తే మిగతా చోట్ల బడిపిలుస్తోంది ర్యాలీలు, గ్రామసభలు జరిగిన దాఖలాలు లేవు. బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలోను పండగలా చేయాలని కలెక్టర్ ఎంఎం.నాయక్ ఆదేశించినప్పటికీ స్థానిక ఉపాధ్యాయులు కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ జరుగుతోంది.
 
 మండల కమిటీలో ఉన్న ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ, ఎంఈఓలు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి షెడ్యూల్ అమలు చేయని పాఠశాలలపై చర్య లు చేపట్టాల్సింది పోయి ముందుగా సిద్ధం చేసుకున్న పాఠశాలలకు మాత్రమే వెళ్లి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రో జుల పాటు నిర్వహించాల్సిన బడిపిలుస్తోంది కార్యక్రమంలో రెండో రోజు షెడ్యూల్ అమలు కాకపోతే ఇక మిగిలిన రోజుల కార్యక్రమాలు ఏం జరుగుతాయంటూ పలువురు సందే హం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మంత్రి మృణాళిని చీపురుపల్లి పట్టణంలో శనివారం వధ్యాహ్నం 12.15 గంటల నుంచి సాయంత్రంవరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడిపిలుస్తోంది కార్యక్రమం అంతంతమాత్రంగా నిర్వహించడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు