సాక్షి, అమరావతి: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు ఇటీవల చాలా తప్పులు చేశారని చెప్పారు.
ఒక ప్రధాన అర్చకుడు రాజకీయాలు మాట్లాడటం ఆలయ నియమాలకు విరుద్ధమన్నారు. ఇంతవరకూ రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు.ఇప్పుడు హద్దులు దాటి మరీ ఆరోపణలు చేస్తున్నందున ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే టీటీడీ ఆస్తులు, ఆభరణాలపై తనిఖీకి ఆదేశిస్తామన్నారు. డాలర్ శేషాద్రి విషయం గురించి కూడా ఆరా తీస్తామన్నారు.