బ్రాహ్మణులపై కక్షకట్టిన బాబు

26 Feb, 2019 11:57 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చిత్రంలో ఎమ్మెల్యేలు కోన రఘుపతి, విశ్వేశ్వరరెడ్డి

ముఖ్యమంత్రి మోసాలు ఎండగడదాం

కోన రఘుపతి, విశ్వేశ్వరరెడ్డి, మల్లాది విష్ణు

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని బ్రాహ్మణులపై కక్ష కట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ కన్వీనర్లు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం నగరంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో ‘వైఎస్సార్‌సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ’ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు సుదర్శన శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్వీనర్లు కోన రఘుపతి, మల్లాది విష్ణు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల స్థితిగతులు తెలుసుకుని వారి అభివృద్ధికి తీసుకునే చర్యలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచుతారన్నారు. ఇది బ్రాహ్మణులకు శుభపరిణామమన్నారు. మహానేత వైఎస్‌ హయాంలో కులాలు, మతాలకు అతీతంగా అంతా అభివృద్ధి చెందారన్నారు. అయితే చంద్రబాబు మాత్రం బ్రాహ్మణుల విషయంలో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేవసిన ఐవీఆర్‌ కృష్ణారావు విషయంలో ఎలా వ్యవహరించారో రాష్ట్రమందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ  కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తెలంగాణ వ్యక్తికి కట్టబెట్టారన్నారు. ఆయన చంద్రబాబు కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. సమాజంలో బ్రాహ్మణులకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అత్తెసరు నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రూ. వెయ్యి కోట్లతో ఫెడరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రతి బ్రాహ్మణుడు మెచ్చేలా కమిటీ నివేదిక ఉంటుందన్నారు. టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితుల విషయంలో సీఎం వ్యవహరించిన తీరు బ్రాహ్మణులు మరిచిపోరన్నారు. రాష్ట్రంలో ధార్మిక, దేవాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. పుష్కరాల సమయంలో  పెద్ద సంఖ్యలో ఆలయాలను  కూల్చివేశారని గుర్తు చేశారు. విజయవాడ అమ్మవారి గుడిలో క్షుద్రపూజలేంటని ప్రశ్నించారు. వీటిన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారన్నారు. 

అర్చకులంటే అంత చులకనా?
ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలన్నారు. అర్చకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా చులకనగా ఉందన్నారు. వివిధ సర్వేల్లో వైఎస్సార్‌సీపీ ముందుంజలో ఉండడంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే బ్రాహ్మణులకు మంచిరోజులు వస్తాయన్నారు. కమిటీ సభ్యుడు డాక్టర్‌ హెమ్మనూరు సుదర్శనశర్మ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో బ్రాహ్మణులు 8 లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. ఈ ప్రాంతం నుంచి ఒక అసెంబ్లీ టికెట్‌ కేటాయించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సంఘాల నాయకులు రఘురామయ్య, జ్వాలాపురం శ్రీకాంత్, ప్రసాద్, తారానాథ్‌ శర్మ, మధుసూదన్, జ్వాలా నరసింహ, బీఎస్‌ఎన్‌ కుమార్, సురేష్, నిరంజన్‌శర్మ, శ్రీనివాసమూర్తి, నాగేష్, పురుషోత్తం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు