‘మనగుడి’ పోస్టర్ ఆవిష్కరణ

9 Aug, 2013 05:16 IST|Sakshi
 ‘ భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ ధర్మదాయ శాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఈనెల 21న నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆలయ ఏఈఓ ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనగుడి పేరిట అనేక ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్నామని, ఈనెల 11 నుంచి వరుసగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని తెలిపారు. ఈనెల 16న స్థానిక బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద నున్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొన్న భక్తులకు టీటీడీ నుంచి కంకణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్, భద్రాచలం ధార్మిక మండలి సభ్యులు శీలం పుల్లారెడ్డి, గంజి పురుషోత్తం పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు