రాత్రి సీజ్‌.. పొద్దున్నే పర్మిషన్‌

25 Aug, 2019 09:10 IST|Sakshi
ఎంఈఓ సీజ్‌ చేసిన శ్రీచైతన్య గేట్‌ 

సీజ్‌ చేసిన పాఠశాలలు తీయడంలో మరమ్మమేంటీ?

సీజ్‌ చేసి ఉన్నా శ్రీచైతన్య పాఠశాల యథావిధిగా నడిచింది

నారాయణ పాఠశాల మధ్యాహ్నం నుంచి ప్రారంభించారు

రాత్రి ఎంఈఓ సీజ్‌ చేయడం... పొద్దున్నే డీఈఓ అనుమతులు ఇవ్వడం

విద్యాశాఖాధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు 

సాక్షి, కందుకూరు రూరల్‌: నిబంధనలకు విరుద్దంగా పబ్లిక్‌ సెలవు దినాల్లో పాఠశాలలను నడుపుతున్న రెండు ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి బి.శివన్నారాయణ పరిశీలించి సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన తాళాలను జిల్లా విద్యాశాఖాధికారికి శుక్రవారం రాత్రే అందజేశారు. అయితే తెల్లవారే సరికి డీఈఓ నుంచి అనుమతులు వచ్చాయని పాఠశాలలను యథావిధిగా నడుపుకున్నారు. శ్రీ చైతన్య పాఠశాలకు సీజ్‌ చేసిన తాళాలను తీయకుండా గేటుకు ఉన్న చిన్న గేటు నుంచి పాఠశాలను నడిపారు. నారాయణ పాఠశాల అయితే శనివారం మధ్యాహ్ననాకి డీఈఓ అనుమతులు ఇచ్చారని తాళాలు కూడా ఇచ్చారని మధ్యాహ్నం నుంచి పాఠశాలను ప్రారంభించారు.  అయితే శుక్రవారం పాఠశాలలను సీజ్‌ చేసి ఎంఈఓ రాత్రికి డీఈఓకు తాళాలు అందజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకుంటాయి. పాఠశాలలను మాత్రం 9 గంటలకే ప్రారంభిస్తారు. అయితే డీఈఓ అనుమతులు ఇచ్చారని సీజ్‌ చేసిన తాళాన్ని కూడా తీయకుండా శ్రీచైతన్య పాఠశాల తరగతులను నడిపింది. రాత్రికి రాత్రే అనుమతులు డీఈఓ అనుమతులు ఎలా ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పూట కూడా గడవకముందే అనుమతులు ఇచ్చిన డీఈఓపై పలువురు విద్యావేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాల మధ్యాహ్నం వరకు పాఠశాల తెరవలేదు. మధ్యాహ్నం నుంచి డీఈఓ నుంచి అనుమతుల మేరకు తాళాలు తెచ్చుకున్నామని తాళాలు తెరచారు. 

విద్యాశాఖాధికారుల మధ్య సమన్వయ లోపం 
విద్యాశాఖలో మండల అధికారిగా ఉన్న బి.శిన్నారాయణ పాఠశాలను పరిశీలించి నిబంధనలు అతిక్రమించారని పాఠశాలను సీజ్‌ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారికి నివేదించి తాళాలు కూడా అప్పగించారు. అయితే తిరిగి సీజ్‌ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇచ్చేటప్పుటు కనీసం ఎంఈఓకు కూడా తెలియకుండా అనుమతులు ఇవ్వడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కింద స్థాయి నిబద్ధతతో పని చేయడం... పై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా యాజమాన్యాలకే తాళాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

ఎంఈఓ ఏమన్నారంటే
ఎంఈఓ శిన్నారాయణను వివరణ కోరగా సీజ్‌ చేసి ఉంటే పాఠశాలలు ఎలా తీశారని పాఠశాల ప్రిన్సిపాల్స్‌ను అడగగా డీఈఓ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెప్తున్నారు. శ్రీచైతన్య అయితే పాఠశాల నడుపుకోండి తర్వాత తాళాలు వచ్చి తీసుకెళ్లండని డీఈఓ చెప్పారని వారు సమాధానం ఇచ్చారని ఎంఈఓ తెలిపారు. సీజ్‌ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా అధికారి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు.

డీఈఓ వివరణ ఏంటంటే..
ఈ విషయమై డీఈవో సుబ్బారావును వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్‌ సెలవు రోజైన కృష్ణాష్టమి రోజున తరగతులు నిర్వహిస్తున్నందున కందుకూరులోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలను శుక్రవారం ఎంఈవో పరిశీలించి సీజ్‌ చేశారన్నారు. అయితే ఆయా పాఠశాలల నిర్వాహకులు మరోసారి ఇలాంటి పొరపాటు చేయబోమని ప్రాధేయపడటంతో శనివారం స్కూలు నిర్వహించుకోవాలని చెప్పామన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓకు తెలియజేయడంలో సమాచార లోపం జరిగిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు