సాక్షి, అమరావతి: ప్రజాధనం ఆదా చేస్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటను రుజువు చేసి చూపించారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్తో రూ. 830 కోట్లు ఆదా అయ్యిందని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం కొరకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో 12.6 శాతం లెస్కి టెండర్ వేశారని తెలిపారు. దీని ద్వారా వైఎస్ జగన్ సత్తా ఏంటో మరోసారి రుజువయ్యిందని వ్యాఖ్యానించారు. ఒక్క పోలవరంలోనే ఇంత దోపిడి జరిగితే.. ఐదేళ్ల టీడీపీ పాలనాకాలంలో ఎంత దోపిడీ జరిగిందో అర్థమవుతోందని మంత్రి విమర్శించారు.
సోమవారం అమరావతిలో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. ఇన్నాళ్లు తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలన పారదర్శకమైనదని రుజువయ్యిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోకుండా ఇప్పటికే జ్యూడిషియల్ కమిషన్, లోకాయుక్త ఏర్పాటు చేశారని మంత్రి గుర్తుచేశారు. ఇతర దేశాల వాళ్ళు కూడా వైఎస్ జగన్ ప్రవేశపెట్టే సంస్కరణలను ప్రసంసిస్తున్నారని కొనియాడారు. టీడీపీ నేతల దోపిడీ రివర్స్ టెండరింగ్తో బట్టబయలయిందని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.