పైరవీలు చేస్తే నా దృష్టికి తీసుకురండి : కోలగట్ల

13 Jul, 2019 20:05 IST|Sakshi

సాక్షి, విజయనగరం : నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకోసారి భారీ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించాలని, పేకాట, వ్యభిచారం ఎక్కడ జరిగినా చర్యలు తీసుకోవాలని డీఎస్పీలను ఆదేశించారు. బహిరంగ మద్యపానం ఎక్కువగా ఉందని.. బార్ల ముందు రోడ్లపై తాగడాన్ని నియంత్రించాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. పార్కింగ్‌ ప్రదేశాలు గుర్తించమని పోలీసు అధికారులకు సూచించారు.

అన్ని రంగాల వారికి మేలు చేకూర్చేలా బడ్జెట్‌ ఉందన్నారు వీరభద్ర స్వామి. ఎన్నికల హామీలను మరిచిపోలేదని చెప్పే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. 40 రోజలు పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కలిగిందని తెలిపారు. లంచాలు ఇవ్వొద్దని.. నాయకుల పేర్లు చెప్పి అధికారులు పైరవీలు చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. గత పాలకులు అలసత్వం వల్ల తాగునీటి ఎద్దడి వచ్చిందన్నారు. ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటామని తెలిపారు. తారక రామ సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తయితే తాగు నీటి సమస్య తీరుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించాలని ఇరిగేషన్‌ మంత్రిని కోరామన్నారు.

మరిన్ని వార్తలు