ఇక మహిళలదే రాజ్యం

2 Mar, 2014 00:13 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి:  పురపాలక పీఠాలపై మహిళ లలే ఆసీనులు కానున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అనూహ్య రీతిలో మెజారిటీ స్థానాల చైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వు అయ్యాయి. మునిసి‘పోల్స్’పై ఆశలు పెట్టుకున్న పురుషులకు ఈ రిజర్వేషన్లు కంగుతినిపించాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన మరో మూడు నగర పంచాయతీల చైర్‌పర్సన్ స్థానాలు మహిళలకే  రిజర్వు అయ్యాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ స్థానాల రిజర్వేషన్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం సాయంత్రం ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్ల కేటాయింపులో జనరల్, బీసీ వర్గాలకు పెద్ద పీట లభించగా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం లభించలేదు.

సుప్రీం  ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. 2012లో నిర్వహించిన కుల గణన ఆధారంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించింది. వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌గత ఏడాది ఆగస్టు నెలలో గజిట్ నోటిఫికేషన్ వెల్లడించారు. ఇప్పుడు చైర్‌పర్సన్ పదవులకూ రిజర్వేషన్లు వెల్లడి కావడంతో వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా, మెదక్, సిద్దిపేట మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పదవులు జనరల్(అన్ రిజర్వుడు) కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్‌పర్సన్ స్థానాలు మహిళా(జనరల్) అభ్యర్థులకు రిజర్వు అయ్యాయి.

 నగర పంచాయతీలు బీసీలకు..
 జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు నగర పంచాయతీలూ బీసీలకు రిజర్వు అయ్యాయి. అందోల్-జోగిపేట, చేగుంట, దుబ్బాక నగర పంచాయతీల చైర్ పర్సన్ స్థానాలు బీసీ(మహిళ)లకు రిజర్వు కాగా .. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్ పర్సన్ బీసీ(జనరల్)కు రిజర్వు అయింది.

మరిన్ని వార్తలు