బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు

21 Nov, 2018 09:48 IST|Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై పారిశుద్ధ్య కార్మికులు భగ్గుమన్నారు. 220 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడంతో ఆగ్రహించిన వారు బుధవారం బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. హిందూపురంలోని ఆయన నివాసంలోకి దూసుకెళ్లి మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. బాలకృష్ణ ఇంటిని కార్మికులు ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకొని ఈడ్చి పడేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని వార్తలు