నా భర్త ఆచూకీ తెలపండి !

15 May, 2015 10:32 IST|Sakshi
నా భర్త ఆచూకీ తెలపండి !

 కె.గంగవరం : తన భర్తను ఆయన తరఫు బంధువులు దాచేశారని, 25 రోజులుగా ఆయన కనిపించడం లేదని, ఆచూకీ తెలపాలని పుణ్యవతి అనే మహిళ గురువారం పోలీసులను ఆశ్రయించారు.  బాధితురాలి కథనం  ప్రకారం..
 
  ఐదేళ్ల క్రితం కోలంక గ్రామానికి చెందిన లింగం రాముతో పుణ్యవతికి వివాహం జరిగింది. పుణ్యవతి తక్కువ కులానికి చెందిన మహిళ అనే ఉద్దేశంతో రాము నుంచి ఆమెను విడదీయడానికి అతని బంధువులు యత్నిస్తున్నారు. తక్కువ కులస్తురాలనే కారణంతో భర్తతోపాటు అతని బంధువులు ఐదేళ్ల నుంచి పుణ్యవతిని వేధిస్తున్నారు. దీనిపై నాలుగు నెలలు క్రితం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అప్పటి ఎస్సై రాము, అతని కుటుంబ సభ్యులను మందలించారు. అప్పటి నుంచి సక్రమంగా ఉంటున్నారని పుణ్యవతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదేళ్లలో తన భర్త తనకు ఆరుసార్లు అబార్షన్ చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
   ఈ మధ్య గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొండ వెంకన్న తన భర్తకు తనకు ఏ సంబంధం లేదని తెల్లకాగితంపై రాసి ఇవ్వాలని బెదిరించారని తెలిపారు. తాను ససేమిరా అనడంతో అప్పటి నుంచి రాము కుటుంబ సభ్యులు, బొండ వెంకన్న తన భర్తను ఎక్కడో దాచేశారని పుణ్యవతి ఆరోపించారు. నిరుపేదనైన తాను రూ.40వేలు కట్నంగా తీసుకువచ్చానని, తక్కువ కులస్తురాలినని తనను మోసం చేసేందుకు భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులు యత్నిస్తున్నారని, వారిపై  చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పుణ్యవతి కోరారు.  ఈ మేరకు స్థానిక పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు