కిక్కు.. లక్కు

25 Jun, 2014 02:06 IST|Sakshi
కిక్కు.. లక్కు
కొవ్వూరు : మద్యం అమ్మకాలపై కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తూచ్ అనేసింది. పాత విధానంలోనే మద్యం దుకాణాల లెసైన్సులు కేటాయించాలని నిర్ణయించింది. లెసైన్సు ఫీజులు పెంచి దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానం పలి కింది. దుకాణాలను దక్కించుకునేందుకు మద్యం సిండికేట్లు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రస్తు తం తమ చేతుల్లోనే ఉన్న దుకాణాలు ఇతరులకు దక్కకుండా చూసేందుకు పథకాలు పన్నుతున్నారు. ఒక్కొక్క దుకాణానికి సగటున 10కి తగ్గకుండా బినామీలతో దరఖాస్తులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాన దుకాణాలకు అనుబంధంగా బెల్టు షాపులు నిర్వహించడాన్ని నిషేధించినా, వ్యాపారాన్ని లాభసాటిగా మలుచుకోవడంలో మెళకువలు నేర్చుకున్న సిండికేట్ పెద్దలు అధిక మొత్తంలో దుకాణాలను 
 
 దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నా రు. అధికార పార్టీ నేతలు వీటిపై కన్నేశారు. ఎక్కడెక్కడ మద్యం విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి.. ఏ షాపులు లాభదాయకంగా ఉంటాయన్న దాని పై  అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వీటికి ఇతరులు పోటీకి రాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు. ఒకవేళ లాటరీ విధానంలో దుకాణాలు తమకు దక్కకపోతే ఎదుటివారికి ఎంతోకొంత ముట్టజెప్పి వాటిని చేజిక్కించుకునేందుకు సిండికేట్ పెద్దలు పథకాలు పన్నుతున్నారు. 
 
 జిల్లాలో నాలుగు స్లాబ్‌లే
 జనాభా ప్రాతిపదికన మద్యం షాపుల కేటారుుంపును ఐదు స్లాబ్‌లుగా విభజించినప్పటికి జిల్లాలో నాలుగు స్లాబులు మాత్రమే అమలు కానున్నాయి. దరఖాస్తులను స్వీకరించిన అనంతరం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనుండటంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంది. 
 
 475 దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
 జిల్లాల్లో 473 మద్యం దుకాణాలతోపాటు రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెండు మద్యం దుకాణాలను కలుపుకుని మొత్తం 475 దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం షాపుల లీజు గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. జూలై 1వ తేదీ నుంచి కొత్త లెసైన్సుదారులు రానున్నారు. నూతన విధానంపై ఏలూరులో మంగళవారం ఎక్సైజ్ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణలో బిజీ అయ్యారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులను ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అందించాలి.  28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీసి అదేరోజు దుకాణాల లెసైన్సులు మంజూరు చేస్తారు.
 
 లెసైన్సు ఫీజుల నిర్ధారణలో తిరకాసు
 జనాభా ప్రాతిపదికన లెసైన్సు ఫీజు నిర్ధారించినప్పటికీ పట్టణం లేదా నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలోని షాపులన్నిటికీ ఒకే తరహా ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో లెసైన్సు ఫీజు పట్టణ స్థారుులో చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఉదాహరణకు కొవ్వూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఊనగట్లలో 5వేల లోపు మాత్రమే జనాభా ఉన్నారు. ఈ ప్రకారం ఇక్కడ లెసైన్సు ఫీజు రూ.32.50 లక్షలు ఉండాలి. అయితే, దీనికి పక్కనే ఐదు కిలో మీటర్లలోపు దూరంలో ఉన్న చాగల్లులో స్లాబ్ ధరలను ఇక్కడ అమలు చేస్తున్నారు. 
 
 దీంతో ఇక్కడ లెసైన్సు ఫీజు రూ.36 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. తిమ్మరాజుపాలెం, బ్రాహ్మణగూడెం, సమిశ్రగూడెంలోని రెండు దుకాణాలకు నిడదవోలు పట్టణంలో విధించే స్లాబ్ ఫీజులను వర్తింపచేస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అదే పరిస్థితి. వేములూరు, వాడపల్లి షాపులకు రాజ మండ్రి నగరపాలక సంస్థ పరిధిలో అమలులో ఉన్న స్లాబ్ ధరలను వర్తింపచేస్తున్నారు. కొవ్వూరులోనూ రాజమండ్రి స్లాబ్‌లను అమలు చేస్తుం డగా.. కొవ్వూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామాలకు ఇదే స్లాబ్‌ను వర్తింపచేస్తున్నారు. 
 
 దీంతో ఈ రెండు దుకాణాల్లో ఏకంగా రూ.50 లక్షల చొప్పున లెసైన్సు ఫీజు చెల్లిం చాల్సి వస్తోంది. వాస్తవంగా ఈ రెండు గ్రామాల్లో జనాభా 5వేల లోపు మాత్రమే. ఇక్కడ రూ.32.50 లక్షలు స్ల్లాబ్ అమలు చేయాలి. కార్పొరేషన్‌కు, మునిసిపాలిటీకి ఐదు కిలో మీట ర్ల పరిధిలో ఉండటంతో ఇక్కడ ఒక్కో షాపునకు రూ.17.50 లక్షల చొప్పున అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఏలూరు నగరం సమీపంలోని గ్రామాల్లో దుకాణాలకు ఇదే విధమైన ఇబ్బంది ఉంది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లోనూ లెసైన్సు ఫీజులు పట్టణ స్లాబ్‌లను అమలు చేస్తున్నారు. 
 
 దరఖాస్తు చేయడం ఇలా
 ఒక్కొక్క దుకాణం లెసైన్సు అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.25 వేలు చలానా రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ములు దరఖాస్తుదారుడికి తిరిగి చెల్లించరు. లెసైన్సు ఫీజు నిమిత్తం నిర్ధేశించిన స్లాబ్ సొమ్ములో పది శాతం సొమ్మును డీడీ తీసి అప్లికేషన్‌కు జతపర్చాలి. ఒకవేళ దుకాణదారునికి షాపు దక్కపోతే డీడీ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తుదారుడు ఏ-1, ఏ-3 ఫారాలను నింపి రూ.100 స్టాంప్‌పై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చట్టాలను అనుసరించి షాపును నిర్వహిస్తానని, నిబంధనలకు కట్టుబడి ఉంటానని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.  ఏ-2 ఫారం నింపి దరఖాస్తుదారునికి సంబంధించిన ఆస్తుల వివరాలను తెలియజేసే ఆఫిడవిట్‌ను రూ.100 స్టాంప్‌పై నోటరీ చేయించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 
 
 వీటితోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఇవన్నీ అందజేసిన వారికి టెండర్ల సమయంలో కేంద్రం లోపలికి ప్రవేశించేందుకు ఎంట్రీ పాస్‌ను అందిస్తారు. ఎవరైతే దరఖాస్తుదారుడో అతనే టెండరు సమయంలో లోనికి వెళ్లాల్సి ఉంటుంది. దరఖాస్తుదారునికి బదులు ఇతరులు ఎవరైనా టెండరు కేంద్రంలోకి ప్రవేశిస్తే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. దుకాణం దక్కించుకున్న వ్యక్తి ముందుగా చెల్లించిన 10 శాతం సొమ్మును మినహాయించి షాపు లెసైన్సు ఫీజులో మూడోవంతు ఫీజును చెల్లించాలి.
 
మరిన్ని వార్తలు