లోకేష్ కోసమే పట్టి సీమ: దేవినేని

2 Apr, 2015 19:18 IST|Sakshi

విజయవాడ : లోకేష్‌కు దోచిపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్ట్ చేపట్టారని మాజీమంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆరోపించారు. దమ్ముంటే పట్టిసీమ ప్రాజెక్ట్‌పై అఖిలపక్షంతో బహిరంగ చర్చ నిర్వహించి చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
 కాంగ్రెస్ పార్టీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు చేపడితే ధనయజ్ఞం కోసం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తన కుమారుడు లోకేష్ కోసం పట్టిసీమ చేపట్టారా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వెలిగొండ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై ఆరోపణలు వస్తే ఇంజినీరింగ్ అధికారులు, మంత్రులను ప్రాజెక్టుల వద్దకు పంపి విపక్షాలతో బహిరంగ చర్చ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమను చేపడుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం లోకేష్ స్నేహితుడు కృష్ణారెడ్డికి 22 శాతం అధిక మొత్తానికి టెండర్‌ను కట్టబెట్టిందన్నారు. ప్రస్తుతం దీని విలువ రూ.2వేల కోట్లకు చేరిందని చెప్పారు.

మరిన్ని వార్తలు