విద్యుత్ ఉద్యోగుల సమ్మె యథాతథం

25 May, 2014 20:33 IST|Sakshi

హైదరాబాద్:విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు  సఫలీకృతం కాకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు నడుంబిగించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించని విద్యుత్ జేఏసీ సమ్మెతోనే తగిన సమాధానం చెప్పాలని భావిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఐఆర్(మధ్యంతర భృతి) చెల్లిస్తేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామన్నారు.


అంతకుముందు కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు.

మరిన్ని వార్తలు