ఆ 'శిక్ష'ణ తో.. ఉప'యోగా'లెన్నో..

21 Jun, 2019 12:48 IST|Sakshi
పులిమేరు యోగా శిక్షణ కేంద్రంలో యోగాసనాలు వేస్తున్న రామకృష్ణ

రామకృష్ణలో పెనుమార్పులు తీసుకువచ్చిన జైలు జీవితం

పల్లెల్లో యోగా శిక్షణే ప్రధాన లక్ష్యంగా అడుగులు

పెద్దాపురం: క్షణికావేశంలో చేసిన తప్పుకు జైలు శిక్ష అనుభవించాడు.  సత్పప్రవర్తతో అందరికీ ఆదర్శంగా నిలవాలంటే ఏ మార్గమైతే మంచిదంటూ కుటుంబాన్ని తీసుకుని వేరే గ్రామంలో కాపురం పెట్టాడు. ఉన్న కుట్టు మెషీన్‌తో కుటుంబ పోషణ సాగిద్దామంటే చాలీచాలని సొమ్ములతో ఎన్నాళ్లీ బతుకంటూ ఓ పెట్రోల్‌ బంకులో పని కుదుర్చుకుని, టైలరింగ్‌ వృత్తి చేస్తూ కాలం గడుపుతున్నారు. అంతా బాగానే సాగిపోతోంది కానీ ఏదో వెలితి...  తాను జైలు శిక్షలో ఉన్నప్పుడు మదిలో కలిగిన ఆలోచన ఆయనను వెంటాడుతోంది. జైలులో పొందిన యోగా శిక్షణను పల్లె ప్రజలకూ ఇస్తే బాగుంటుందని భావించాడు. యోగా గురువుగా మారాడు. పల్లె ప్రజలకు యోగా శిక్షణ ఇస్తూ పల్లె ప్రాంతంలో యోగా కేంద్రం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి సుమారు వంద మందికి శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలిచిన యోగా గురువు జీవిత గాథ ఇది.కోరుకొండ మండలం ఇల్లెందుపాలేనికి చెందిన మసిముక్కల రామకృష్ణ సుమారు 13 ఏళ్ల క్రితం ఆ గ్రామ రాజకీయ ఘర్షణల నేపథ్యంలో వ్యక్తి హత్య కేసులో ముద్దాయిగా మారాడు. వాదోపవాదాల అనంతరం కోర్టు ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. భార్య, కుమారుడు, కుమార్తె ఒంటరి కావడంతో భార్య సుబ్బలక్ష్మి ఇరువురిని తీసుకుని పెద్దాపురం మండలం దివిలి అమ్మగారి ఇంటి వద్దకు వచ్చేసింది. ఆమెకు ఉన్న కుట్టు మెషీన్‌ సాయంతో కుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల 2016 జనవరి 26న సత్ప్రవర్తతోనే ఉండే ఖైదీలను విడుదల చేసే సమయంలో జైలు నుంచి రామకృష్ణ విడుదలయ్యాడు. శిక్ష పూర్తి చేసుకుని అటు స్వగ్రామం వెళ్లలేక అత్తారింటికి కాపురం వచ్చేశాడు రామకృష్ణ.

మంచి సత్పప్రర్తనతో మెలగాలనే..

అత్తారింటికి కాపురం వచ్చేసిన రామకృష్ణ జైలు జీవితం నుంచి సమాజంలో మంచి సత్పప్రవర్తనతో మెలగాలని భార్య, కుమారుడితో సంసార జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాడు.
పులిమేరు పెట్రోల్‌ బంకులో పనికి చేరాడు. తనతో పాటు కుమారుడు ప్రేమ్‌కు కూడా అక్కడే ఉద్యోగం సంపాదించి ఇద్దరూ బంకులోనే పనిచేస్తుండడంతో కాపురాన్ని పులిమేరు మకాం మార్చాడు. అంతేకాదు తనకు తెలిసిన యోగాసనాలు మరికొందరికి నేర్పాలనే ఉద్దేశంతో  అదే గ్రామంలో ఓ మైదానంలో యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ సుమారు 100 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు రామకృష్ణ.యోగాతో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం లభిస్తుందంటూ పులిమేరు పరిసర గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు రామకృష్ణ. ప్రతి పదిహేను రోజులకోసారి దివిలి, తిరుపతి, చదలాడ, పులిమేరు, పిఠాపురం మండలం విరవ గ్రామాల్లో యోగాసనాలు వేస్తూ అవగాహన కల్పిస్తుంటారు. ఆయా గ్రామాల నుంచి 12 ఏళ్ల వయస్సు నుంచి 60 ఏళ్ల  వృద్ధుల వరకు సుమారు 100 మంది ఇక్కడ శిక్షణ నేర్పిస్తున్నారు.

జైలులో నేర్పిన యోగానే నా జీవితానికి మలుపు
జైలు శిక్ష సమయంలో రాజమహేంద్రవర్మ కర్మాగారంలో నేర్పిన యోగాయే తన జీవితంలో మంచి మార్పు తెచ్చిపెట్టింది. చాలా అనారోగ్య పరిస్థితిల్లో క్షణికావేశంలో జైలుకు వెళ్లిన నాకు అక్కడ యెగా నేర్పడంతో అనారోగ్యాలు దూరమై మానసిక ప్రశాంతత లభించింది. అదే మార్పును సమాజంలోని ప్రతి ఒక్కరికీ యోగా నేర్పించాలన్నదే నా ప్రధాన ధ్యేయం.– మసిముక్కల రామకృష్ణ, యోగా గురువు, పులిమేరు, పెద్దాపురం మండలం

>
మరిన్ని వార్తలు