అనంతపురం: రూ. 46 లక్షల చోరీ ఘటన.. అంతా డ్రామా..

20 Dec, 2023 14:01 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఐడీబీఐ బ్యాంక్‌ వద్ద జరిగిన చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీ చేసింది క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ పోతురాజుగా నిర్ధారించారు. ఏజెంట్‌ స్నేహితులను నిందితులుగా తేల్చారు. కేసు వివరాలను ఎస్పీ అన్భురాజన్‌ వివరించారు. ఏటీఎం ఉద్యోగిగా పనిచేస్తున్న పోతురాజు.. డబ్బుపై కాజేయాలని భావించి తన స్నేహితులతో కలిసి మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు పోలీసులు తెలిపారు.

బ్యాంకు నుంచి డబ్బు తీసుకొస్తున్న టైమ్‌లో దోపిడీ జరిగినట్లు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. తనపై దాడి చేసి డబ్బు తీసుకెళ్లారని తప్పుడు ఫిర్యాదు చేశారు. అయితే ఆడిన అబద్దం సరిగ్గా అతక్కపోవడంతో దొంగతనం డ్రామా బయటపడింది. పోతురాజు సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అతడిని విచారించగా.. స్నేహితులతొ కలిసి చోరీ డ్రామా ఆడినట్లు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 46,55,723 నగదు, రెండు మోటార్‌ సైకిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డబ్బుపై అత్యాశతోనే పోతురాజు చోరీ నాటకం ఆడినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు