ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు పనిచేయాలి

11 May, 2020 04:46 IST|Sakshi

వలస కార్మికులు రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులపై నడిచి వెళ్లకుండా చూడండి

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సూచనలు

సాక్షి, అమరావతి: అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు పనిచేసే లా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రా ష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మిని స్ట్రేట ర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రాజీవ్‌ గౌబ ఏం చెప్పారంటే..
► వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఆ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలి.
► వలస కార్మికులు రైల్వే ట్రాక్‌లు, రహదారులపై వారి స్వస్థలాలకు నడిచి వెళ్లకుండా ఆపాలి. ఎవరైనా నడిచి వెళుతుంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి.. ప్రత్యేక రైళ్ల ద్వారా వారి స్వరాష్ట్రాలకు పంపాలి. రైళ్లు ఎప్పుడు బయలుదేరతాయో ముందుగానే వలస కార్మికులకు సమాచారమందించాలి. 
► విదేశాల్లో చిక్కుకున్న వారిని విమానాలు, ఓడలు ద్వారా తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇలా వచ్చే వారిని ఆయా రాష్ట్రాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచాలి.
► పరిశ్రమలు పునఃప్రారంభం అవుతున్నందున ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక పారిశ్రామిక భద్రతా చర్యలు తీసుకోవాలి.
► ఈ నెల 17 వరకు కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో, మిగిలిన చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి.
► వివిధ జోన్లలో అనుమతిచ్చిన పలు రకాల కార్యకలాపాలను సవ్యంగా జరిగేలా చూడాలి.
విజయవాడ ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ అరుణకుమారి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు