కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

24 Jun, 2019 09:32 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : మండలంలోని బాలిగాం సమీప జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మందస పట్టణం వైపు వచ్చేందుకు వీరు తమ ద్విచక్ర వాహనంపై మలుపు తిరుగుతుండగా, వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మందసలో బంధువుల నిశ్చితార్థం నిమిత్తం టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన కరుమోజి భాస్కరరావు అలియాస్‌ రాంబాబు(42), ఆగూరి తారకేశ్వరరావు ద్విచక్ర వాహనంపై (ఏపీ 31 డీజెడ్‌ 4653) వస్తున్నారు. ఈ క్రమంలో హైవేపై నుంచి మందస పట్టణానికి వచ్చేందుకు బాలిగాం సమీప జంక్షన్‌ వద్ద మలుపు తిరుగుతున్నారు.

అదే మార్గంలో పలాస నుంచి ఇచ్ఛాపురం వస్తున్న కారు (ఏపీ 31ఈపీ5841) వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై నుంచి వారిద్దరూ ఎగిరి పడి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో భాస్కరరావు అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన తారకేశ్వరరావును పలాస ప్రభుత్వాసుత్రికి 108 వాహనంలో తరలించారు. కోమాలోకి వెళ్లిన తారకేశ్వరరావు పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. భాస్కరరావు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం సోంపేట తరలించారు. ఎస్‌ఐ సీహెచ్‌ ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.      

తలగాంలో విషాద ఛాయలు
టెక్కలి రూరల్‌: మందస మండలం బాలిగాం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో కురుమోజు భాస్కరరావు అలియాస్‌ రాంబాబు మృతితో టెక్కలి మండలం తలగాం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన టెక్కలిలో వాచ్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ దుర్వార్త తెలుసుకున్న రాంబాబు భార్య లత గుండెలవిసేలా రోదించడంతో స్థానికులను కలచివేసింది. మృతుడికి కుమారులు రుత్వీక్‌సాయి(8) రూపాక్‌సాయి(3) ఉన్నారు.  

మరిన్ని వార్తలు