పార్వతీపురం: జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎం. నాయక్ తెలిపారు. గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఎన్ఆర్ఈజీఎస్లో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో రోడ్ల నిర్మాణం చకచకా జరుగుతోందన్నారు. రోడ్ల నిర్మాణం కోసం దాదాపు రూ. 180 కోట్లు వెచ్చించే పనిలో ఉన్నామని తెలిపారు. అలాగే మలేరియా నివారణకు మే 15 నుంచి మందు స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
ముఖ్యంగా మలేరియా తీవ్రత అధికంగా ఉన్న తాడికొండ, రేగిడి, మొండెంఖల్, కేఆర్బీపురం తదితర పీహెచ్సీల పరిధిలో ఈ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. దోమ తెరలు కూడా కొనుగోలు చేస్తామన్నారు. పార్వతీపురం డంపింగ్ విషయమై చర్యలు చేపట్టామని, ఏఎన్ఎంలకు ఆస్పత్రి ప్రసవాలపై శిక్షణ ఇచ్చి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్బి లఠ్కర్, ఆర్డీఓ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.