అగ్నిమాపక శాఖ అధికారి రూ.70 వేలు లంచం

6 Mar, 2014 02:56 IST|Sakshi
అగ్నిమాపక శాఖ అధికారి రూ.70 వేలు లంచం

 కర్నూలు
 అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నర్సింగ్ హోం యజమాని నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి(ఏడీఎఫ్‌ఓ) రామన్న బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఆదోని పట్టణానికి చెందిన డాక్టర్ బి.శ్రీనివాసులు స్థానికంగా 51 పడకలతో ఆదిత్య నర్సింగ్ హోం నిర్వహిస్తున్నాడు. వైద్యారోగ్య శాఖ నుంచి నర్సింగ్ హోంకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలంటే ముందుగా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. ఇందుకు గత నెలలో కర్నూలు బీక్యాంప్‌లో ఉన్న అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్రీనివాసులు దరఖాస్తు చేసుకున్నారు.

 

జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, సహాయ అగ్నిమాపక శాఖాధికారి, ఆదోని ఫైర్‌ఆఫీసర్ కలిసి నర్సింగ్ హోంను తనిఖీ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు హైదరాబాద్ రీజినల్ కార్యాలయం అధికారులకు సిఫారసు చేయాల్సి ఉంది. అందుకోసం రూ.1.50 లక్షలు ఇవ్వాలని రామన్న డిమాండ్ చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో డాక్టర్ శ్రీనివాసులు 1.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి అడ్వాన్స్ కింద గత నెలలోనే రూ.50 వేలు ముట్టజెప్పాడు. మిగిలిన డబ్బుల కోసం ఈనెల 3వ తేదీన రామన్న ఆదోనికి వెళ్లి శ్రీనివాసులుతో కలిసి డబ్బులు డిమాండ్ చేశాడు. రెండు, మూడు రోజుల్లోగా డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన శ్రీనివాసులు మంగళవారం కర్నూలులోని సీక్యాంప్ సెంటర్‌లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు.

 

కేసు నమోదు చేసుకున్న అధికారులు రామన్నపై నిఘా వేశారు. డబ్బులు తీసుకుని ఎక్కడికి రమ్మంటావని డాక్టర్ చేత ఫోన్ చేయించారు. తన కార్యాలయం వద్దకు రమ్మని రామన్న సూచించగా సంభాషణను రికార్డ్ చేసి డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో సీఐలు క్రిష్ణారెడ్డి, ప్రసాదరావు, సీతారామారావు, పోలీస్ సిబ్బందితో కార్యాలయం వద్దకు చేరుకుని మాటు వేశారు. శ్రీనివాసుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా రామన్నను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోనే కెమికల్ పరీక్షల అనంతరం కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.
 

మరిన్ని వార్తలు