సంక్రాంతి పండుగ: రద్దీగా మారిన టోల్‌ గేట్లు

11 Jan, 2020 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జమ్‌ ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో హైదరాబాద్‌ నగర వాసులు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి పయనమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ గేట్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌లో 8 టోల్‌ బూతులు తెరిచారు. బూత్‌లో ఫాస్ట్‌ ట్యాగ్‌ స్కానర్‌ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. ఫాస్ట్ టాగ్‌పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్‌లను తీసుకుంటున్నారు.



తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌ బస్టాప్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు యాక్సిడెంట్‌ బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా  నందిగామ వద్ద రహదారులు అన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్‌, విజయవాడ 65 నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. కీసర టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు