జగన్‌తోనే ప్రత్యేక హోదా సజీవం

14 Apr, 2018 12:46 IST|Sakshi
ఈయూ నేత ఆవుల ప్రభాకర్‌కు వినతి పత్రం ఇస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

తిరుపతి మంగళం/యూనివర్సిటీ క్యాంపస్‌: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటివరకు సజీవంగా ఉందంటే అందుకు కారణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువనాయకులు భూమన అభినయ్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వారం రోజులుగా తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద శుక్రవారం ప్రత్యేక హోదా అడగని గాడిద, ప్రత్యేక హోదా కల్పించని గాడిద అంటూ పార్టీ యువజన విభాగం జిల్లా, నగర అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్, బండ్ల లక్ష్మీపతి ఆధ్వర్యంలో రెండు గాడిదలకు బోర్డులు తగిలించి వినూత్న నిరసన తెలిపారు. భూమన అభినయ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కన్నా చంద్రబాబుతోపాటు వారి ఎంపీలకు పదవులే మిన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప ప్రత్యేక హోదా కోసం రోడ్డుపైకి వచ్చి నినదించడంలేదని మండిపడ్డారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుంటే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లేక, కూలిపనులు, భిక్షాటన చేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పార్టీ నాయకులు ఎస్‌కే.బాబు, కేతం జయచంద్రారెడ్డి, జ్యోతిప్రకాష్, రాజేంద్ర, పుల్లయ్య, కోటూరు ఆంజినేయులు,పాముల రమేష్‌రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, తాలూరి ప్రసాద్, ఆమోస్‌బాబు, జీవకోన శ్రీనివాసులు, శివాచ్చారి, వంశీ, గోపాల్‌రెడ్డి, గీత, రమణమ్మ, శాంతారెడ్డి, పుణీత, కవితమ్మ పాల్గొన్నారు.   
కూలి పని చేసి విద్యార్థుల నిరసన
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఎస్వీయూలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం కూలీ పనిచేసి నిరసన తెలిపారు. ఎస్వీయూలో భవన నిర్మాణ పని చేసి ఆందోళన చేశారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాకపోతే విద్యార్థులు కూలీ పనిచేసుకోవాల్సిందేనని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు చరిత్రలో నిలిచిపోతారన్నారు. వారిని చూసి 5 కోట్ల మంది గర్విస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ నాయక్, నరేంద్ర, హేమంత్‌కుమార్‌ రెడ్డి, సుధాకర్, సతీష్, శివకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు