చిత్తూరు డీఈవోగా సుబ్బారెడ్డి?

7 Aug, 2015 02:17 IST|Sakshi

పోటీలో రవీంద్రనాథరెడ్డి  శామ్యూల్‌పై వేటు
టెన్త్ ఫలితాలను సీరియస్‌గా తీసుకున్న సీఎం
సొంత జిల్లా చివరి స్థానం రావడంపై ఆగ్రహం
సమర్థుడైన అధికారిని   పంపాలంటూ విద్యాశాఖకు హుకుం
నేడో, రేపో వెలువడనున్న  ఉత్తర్వులు

 
చిత్తూరు: జిల్లా  విద్యాశాఖాధికారిగా సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుబ్బారెడ్డి గతంలో హైదరాబాద్ డీఈవోగా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనరేట్‌లో డెప్యూటీ డెరైక్టర్‌గా విధులు నిర్వహించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సుబ్బారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి సిసోడియాకు రిపోర్టు చేసుకున్నారు. మరోవైపు ఖమ్మం డీఈవోగా పనిచేసి రిలీవైన రవీంద్రనాథ్‌రెడ్డి సైతం చిత్తూరు డీఈవోగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు డీఈవోగా ఎవరు వస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో చిత్తూరు సహా మొత్తం నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో బదిలీల కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు డీఈవో పోస్టు భర్తీ కానుంది. డీఈవోగా సుబ్బారెడ్డిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
విద్యాశాఖపై సీఎం సీరియస్
 చిత్తూరుకు సమర్థుడైన విద్యాశాఖాధికారిని నియమించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర విద్యాశాఖకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. పదో తరగతి ఫలితాల్లో సొంత జిల్లాకు చివరి స్థానం దక్కడంపై ఇప్పటికే సీఎం ఆగ్రహంతో ఉన్నారు. వెంటనే ఇన్‌చార్జ్‌ల పాలనకు స్వస్తి పలికి రెగ్యులర్ డీఈవోను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపింది.  దీంతో కొత్త డీఈవో నియామకంపై రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలో ఒకరిని చిత్తూరు డీఈవోగా నియమించనున్నట్లు సమాచారం.

శామ్యూల్‌పై వేటు
ఇన్నాళ్లూ పచ్చచొక్కా నేతల మద్దతుతో రెండు డెప్యూటీ డీఈవో పదవులతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారిగా కొనసాగిన శామ్యూల్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. దేశం కార్యకర్తల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప శామ్యూల్ విద్యాశాఖను గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నారు. శామ్యూల్ నిర్వాహకంతో  గత ఏడాది జిల్లా పదిలో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటికీ ఇన్‌చార్జ్ డీఈవోగా కొనసాగేందుకు శామ్యూల్ తనవంతు ప్రయత్నాలుసాగిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు