తాడిపత్రి డీఎస్పీపై సస్పెన్షన్‌ వేటు

2 Oct, 2018 08:39 IST|Sakshi
డీఎస్పీ విజయ్‌ కుమార్‌

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ బి. విజయ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ఆర్పీ ఠాకుర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తాడిపత్రిలో శాంతిభద్రతల నిర్వహణలో డీఎస్పీ విజయ్‌కుమార్‌ వైఫల్యం చెందడంవల్ల సస్పెన్షన్‌ వేటు వేసినట్టు ఆయన పేర్కొన్నారు. వినాయక నిమజ్ఞనం సందర్భంగా తలెత్తిన వివాదంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు.. ప్రబోధానంద ఆశ్రమ భక్తులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణ జరిగిన సంగతి తెల్సిందే.

ఈ వివాదంలో ఇద్దరు మృతి చెందగా కొద్ది రోజులపాటు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఈ ఘటనలో పోలీసులు సకాలంలో స్పందించలేదని, సరిగ్గా వ్యవహరించలేదంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక దశలో పోలీసులు కొజ్జాలు అని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో తీరిగ్గా స్పందించిన పోలీసులు కూడా ఆయన్ను హెచ్చరించారు. ఈ వివాదంపై సీఎం చంద్రబాబును కలిసిన జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో కిందిస్థాయి పోలీసులపై ఇప్పటికే చర్యలు తీసుకోగా తాజాగా డీఎస్పీని సస్పెండ్‌ చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు