ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద మృతి

11 Aug, 2014 00:45 IST|Sakshi

తాడేపల్లి: విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారి మృతదేహాలు గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కృష్ణానదిలో ఆదివారం తెల్లవారు జామున కనిపించాయి. రెండు జిల్లాల్లో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడపకు చెందిన యలమంచిలి నాగలక్ష్మి(17), పెనమలూరుకు చెం దిన బిళ్లా పల్లవి(17) విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరంతా కలసి ఒకే బస్సులో వెళ్లి వస్తుండేవారు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం వారు కాలేజికి వెళ్లి తిరిగిరాలేదు. కానీ వారి పుస్తకాల బ్యాగ్ లు సీతానగరం సమీపంలోని నది ఒడ్డున శనివారం రాత్రి పోలీసులకు లభ్యమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున వారి మృత దేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి.

ఈ ముగ్గురు బాలికలు రెండు రోజుల నుంచి కళాశాలకు హాజరు కాలేదని చెబుతున్నారు. వారు ఇళ్లకు రాకపోయేసరికి తల్లిదండ్రులు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి  ఆచూకీ కోసం వాకబు చేశామని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్నట్లు వారి బ్యాగుల్లో లభిం చిన దర్శనం టికెట్ల ద్వారా తెలుస్తోంది. శనివా రం సాయంత్రం వారు ఇసుక తిన్నెల్లో కనిపించినట్టు స్థాని కుల సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు