మహిళలతో కన్నీరు పెట్టిస్తే అరిష్టమే

3 Jul, 2015 06:12 IST|Sakshi
మహిళలతో కన్నీరు పెట్టిస్తే అరిష్టమే

ఒంగోలు సబర్బన్ : అధికారం కోసం లేనిపోని హామీలిచ్చి అవి నెరవేర్చకుండా ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలకు అరిష్టమేనని..మహిళల ఉసురు ఊరికే పోదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఒంగోలు వచ్చిన ఆమె స్థానిక డీసీసీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో అందరినీ నమ్మించి ఓట్లేయించుకుని చంద్రబాబు అందలమెక్కారన్నారు. మ్యానిఫెస్టో అమలు చేయకుండా ఏడాదిపాటు సాగించిన చంద్రబాబు పాలనంతా డొల్లేనని విమర్శించారు. 

డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి నిలువునా ముంచిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.  ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని విడ గొట్టాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖలిచ్చిన చంద్రబాబు ఆ బురదను కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు.   నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, నెల్లూరుకు చెందిన నాయకురాలు చేను సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ జి.రాజ్ విమల్, వేము శ్రీనివాసరావు, పర్రె నవీన్ రాయ్, గాదె లక్ష్మా రెడ్డి, ఎస్.కె.రసూల్, బొడ్డు సతీష్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు