రుణమాఫీలో కోతే ప్రభుత్వ లక్ష్యం

22 Mar, 2015 02:03 IST|Sakshi

వైఎస్సార్ సీపీ నాయకులు అరుణ్‌కుమార్
 
కంచికచర్ల : రుణమాఫీలో కోత విధించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, మండల కన్వీనర్ బండి జానకిరామయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాటిబండ్ల హరిజగన్నాథరావు తదితరులు శనివారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్‌కార్డు అనుసంధానం, ఇతర నిబంధనల  బూచి చూపిస్తూ చాలా వరకు బ్యాంకు ఖాతాలను తగ్గించారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రూ.87,612కోట్ల వరకు వ్యవసాయ రుణాలు ఉన్నాయని, ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.18.500కోట్లు మాత్రమే బ్యాంకుల ఖాతాలకు జమచేసిందన్నారు.  

ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 4,300కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రైతులు చెల్లించాలని ప్రభుత్వం చెబుతోందని, లేదా సాగుకోసం తీసుకున్న అప్పుకోసం తాకట్టుపెట్టిన బంగారం, పట్టాదార్ పాసు పుస్తకాలు బ్యాంకుల్లో ఉండాల్సిందేననే అంశాన్ని నిబంధనలో ప్రభుత్వం చేర్చడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల ఇతర వ్యక్తుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేందుకు అవకాశం కూడా లేదన్నారు. ఎన్నికల హామీ మేరకు సకాలంలో రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు