రుణ మాఫీ కాదు..వడ్డీ బాదుడు

4 Sep, 2014 01:06 IST|Sakshi
రుణ మాఫీ కాదు..వడ్డీ బాదుడు

పంట రుణాల మాఫీ హామీతో రైతులను నమ్మించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రోజుకో షరతు విధిస్తూ వంచిస్తున్నారు. రుణాల మాఫీ ఎప్పుడన్నది తేల్చని ప్రభుత్వం.. రైతులపై భారాన్ని మోపడంపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేస్తోంది. డిసెంబర్ 31, 2013లోపు తీసుకున్న పంట రుణాలు, వడ్డీని మాత్రమే మాఫీ చేస్తామని సోమవారం ప్రకటించింది. ఆ రుణాలపై జనవరి, 2014 నుంచి ఇప్పటిదాకా వడ్డీని రైతులే చెల్లించాలంది. ఆ మెలిక ఆధారంగా వడ్డీ కట్టాలని రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు.
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో పంట రుణాల మాఫీ హామీని ప్రధానాస్త్రంగా చంద్రబాబు సంధించారు. మార్చి 31, 2014 నాటికి ఉన్న పంట రుణాలన్నింటినీ ఒక్క సంతకంతో మాఫీ చేస్తానని బీరాలు పలికారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే ఆ కుట్రను అమలుచేస్తున్నారు.

రుణ మాఫీ విధి విధానాల ఖరారుకు కోటయ్య కమిటీని నియమించిన చంద్రబాబు.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను సాకుగా చూపి ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్ష మాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత ఆ రుణ మాఫీకి మార్గదర్శకాలను జారీచేశారు. వీటికి సవరణ చేస్తూ సోమవారం మరో ఉత్తర్వు జారీచేశారు. ఆ ఉత్తర్వు ప్రకారం డిసెంబర్ 31, 2013 నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.1.50 లక్ష మాత్రమే ఒక్కో కుటుంబానికి మాఫీ చేస్తారు. డిసెంబర్ 31 తర్వాత ఆ రుణంపై వడ్డీని రైతులే భరించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. అయితే రుణ మాఫీ అవుతుందనే ఆశతో రైతులు అప్పులు చెల్లించలేదు.
 
వడ్డీ బాదుడు..

బ్యాంకర్లు ఏడు శాతం వడ్డీపై రైతులకు పంట రు ణాలు ఇస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాలను వడ్డీ లేకుండా.. రూ.3లక్షల వరకూ రుణాలపై పావలా వడ్డీని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. వాయిదా లోపు రుణాలు చెల్లించిన రైతులకే వడ్డీ రాయితీ వర్తిస్తుం ది. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులు వా యిదాలోగా రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాం కర్లు 11.75 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల వల్ల తొమ్మిది నెలల వడ్డీ రైతులు భరించాల్సిందే. జిల్లాలో 8.56 లక్షల మంది రైతులు రూ.11,180.28 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వ తాజా మెలిక వల్ల రైతులపై రూ.320 కోట్ల మేర వడ్డీ భారం పడనుంది.
 
మాఫీపై తేల్చరేం..

పంట రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం తేల్చడం లేదు. ఎప్పటిలోగా మాఫీ చేస్తామన్నది చెప్పడం లేదు. దాంతో ఏ ఒక్క బ్యాంకరూ కొత్తగా పంట రుణంగానీ.. డ్వాక్రా రుణంగానీ మంజూరు చేయడం లేదు. రుణ మాఫీ కోసం మార్గదర్శకాలను జారీచేసిన ప్రభుత్వం.. వాటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూ చించింది.

ఈ లబ్ధిదారుల ఎంపికలో ఏమైన సమస్యలు వస్తే పరిష్కరించడానికి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కన్వీనర్‌గా ఓ కమిటీని ఈనెల 10లోగా నియమించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ కమిటీలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కన్వీనర్‌గానూ.. వ్యవసాయశాఖ జేడీ, డీఆర్‌డీఏ పీడీ, జిల్లా రెవెన్యూ అధికారి సభ్యులుగా ఉండే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. లబ్ధిదారుల ఎంపికలో సమస్యలను మాత్రమే ఆ కమిటీ పరిష్కరిస్తుంది. కానీ.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పటిలోగా పూర్తిచేయాలి.. ఎప్పటిలోగా ఆ లబ్ధిదారులకు రుణ మాఫీని వర్తింపజేస్తామన్న అంశంపై ప్రభుత్వం నోరుమెదపడం లేదు.
 

మరిన్ని వార్తలు