టీటీడీలో ఆగనున్న రూ.100 కోట్ల పనులు

21 Oct, 2014 02:26 IST|Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీలో జరుగుతున్న సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి పనులు ఆగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన సర్వీస్ ట్యాక్స్‌ను టీటీడీ భరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 27 నుంచి పనులు నిలిపివేయనున్నట్టు కాంట్రాక్టర్లు ప్రకటించారు.
 
టీటీడీలో సుమారు 150 మంది కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. తిరుమలతో పాటు దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు టీటీడీ కాంట్రాక్టర్లు చేస్తున్నారు. పనుల్లో సుమారు 4 శాతం వరకు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర నిబంధన ఉంది. టీటీడీలో సర్వీస్ ట్యాక్స్ వివాదం 2007 నుంచి కొనసాగుతోంది. దీనిపై పలుమార్లు కాంట్రాక్టర్లకు, టీటీడీకి మధ్య చర్చలు జరిగినా పరిష్కారం కాలేదు. రైల్వే, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ తరహాలోనే తమకు మినహాయింపు ఇప్పించాలని, లేనిపక్షంలో ఆ సర్వీసుట్యాక్స్‌ను టీటీడీనే భరించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లక్షల్లో సర్వీసు ట్యాక్స్‌లు చెల్లించాలంటూ కొందరు కాంట్రాక్టర్లకు నోటీసులు అందాయి. ఇందులో భాగంగా ఈనెల 27 నుంచి టీటీడీ పరిధిలో అన్ని రకాల పనులు నిలిపివేస్తున్నట్టు కాంట్రాక్టర్ల సంఘం నేత టి.నరసింహారెడ్డి ప్రకటించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు