రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

14 Jan, 2014 06:09 IST|Sakshi

 డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం(బి) గ్రామశివారులోని నిజాంసాగర్ కాలువ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ మండలం న్యాల్‌కల్‌క చెందిన మెట్టు శ్యాం(42), రైతు ఒడ్డెన్న (55) ఇద్దరు బైక్‌పై డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్నారు. నిజామాబాద్ వైపు నుంచి డిచ్‌పల్లి వైపు వస్తున్న లారీ ధర్మారం(బి) శివారులో ఎదురుగా వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది.
 
 ఈ ప్రమాదంలో శ్యాం ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఒడ్డెన్నను 108లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. మృతుడు శ్యాంకు భార్య ఇంద్ర, ఇద్దరు కుమారులు,కూతురు ఉన్నారు. ఒడ్డెన్నకు భార్య పద్మ, కుమారుడు ఉన్నారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. బైక్‌ను ఢీకొని లారీ రోడ్డు కిందకు దిగిపోయింది.  ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడని ఆయన తెలిపారు.  న్యాల్‌కల్ గ్రామ సర్పంచ్  భర్తభూపతిరావు, సింగిల్ విండో చైర్మన్ గంగాప్రసాద్ జిల్లా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.   
 

>
మరిన్ని వార్తలు