ఫ్లైఓవర్ పనులపై కలెక్టర్ అసంతృప్తి

1 Dec, 2015 01:08 IST|Sakshi

వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
టీమ్ వర్క్‌గా పని చేయాలని సూచన
శంకుస్థాపన వేదిక ఏర్పాట్ల పరిశీలన

 
విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు సంబంధించి మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ఏడు మీటర్ల లోతులో డ్రిగ్గింగ్ చేపట్టాల్సి ఉండగా, కేవలం 3 మీటర్ల వరకే చేయడంపై కలెక్టర్ బాబు.ఎ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ అంతర్ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్లైఓవర్ పనుల శంకుస్థాపనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితీష్ గట్కారీ ఈనెల 5న నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సోమవారం భవానీపురం, కుమ్మరిపాలెం సెంటర్‌లో ఆయన అధికారులతో కలిసి పర్యటించి శంకుస్థాపన కార్యక్రమ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఫ్లైఓవర్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది జూలై 15 నాటికి పూర్తి చే యాలని, వాస్తవంగా చేసే పనులపై ఎప్పటికపుక్పడు టెలిగ్రామ్, వాట్సప్ ద్వారా వివరాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, నిర్మాణ సంస్థ సిబ్బంది టీమ్ వర్క్‌గా పని చేస్తేనే నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయగలుగుతామని కలెక్టర్, ఎన్‌హెచ్, సోమ ప్రాజెక్టు అధికారులతో పేర్కొన్నారు.
 
ఒకే జోన్‌గా పుష్కర ఘాట్‌లు

 దుర్గాఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం, ఫెర్రీ వరకు ఒకే జోన్‌గా పుష్కర స్నాన ఘట్టాల ప్రతిపాదనలు చేస్తున్నందున దానికి అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. అలాగే దుర్గా ఫ్లైఓవర్ వంతెన పనులతో సమాంతరంగా చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై ఇరిగేషన్, మున్సిపల్, రోడ్లు, భవనాలు, దుర్గగుడి, పోమ కంపెనీ ప్రతినిధులు బృందంగా ఏర్పడి ప్రణాళికలు రూపొందించి మ్యాప్‌ను 24 గంటల్లో అందించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్‌కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఇరిగేషన్ ఎస్‌ఈ సి.రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ అధికారులు మోషే, ఆంజేయులురెడ్డి, సోమ ప్రాజెక్టు మేనేజర్ సతీష్ పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు